
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన మూడు సినిమాల్లో నటించారు. హరి హరి వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేశారు పవన్. అయితే ఇప్పుడు ఆయన సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. డిప్యూటీ సీఎంగా బిజీ బిజీగా ఉంటున్నారు. కాగా పవన్ కల్యాణ్, సీనియర్ హీరో మోహన్ బాబు మధ్య గతంలో ఓ వివాదం తలెత్తిన సంగతి అందరికీ తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమ 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 2007లో నిర్వహించిన వజ్రోత్సవాల వేడుకలో వీరి మధ్య మాటల తూటాలు పేలాయి. అప్పట్లో ఈ వివాదం టాలీవుడ్ లో పెద్ద దుమారమే రేపింది. అయితే సుమారు 19 ఏళ్ల తర్వాత ఈ వివాదంపై స్పందించారు మోహన్ బాబు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూకు హాజరైన ఆయన పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఇంటర్వ్యూలో భాగంగా హోస్ట్ .. పవన్ కళ్యాణ్ కి పేద ప్రజలపై కన్సర్న్ ఉంది కదా? వజ్రోత్సవాలప్పుడు జరిగిన గొడవ ఇంకా మీ మనుసులో ఉందా? ఆ తర్వాత పవన్ ని ఎప్పుడైనా కలిసారా? ఆయన సినిమాలో విలన్ రోల్ వస్తే నటిస్తారా అని పలు ప్రశ్నలు అడిగారు మోహన్ బాబుని. వీటికి కలెక్షన్ కింగ్ ఇలా సమాధానాలు చెప్పుకొచ్చారు.’పవన్ కల్యాణ్ కు పేద ప్రజలపై బహుశా కన్సర్న్ ఉండొచ్చు. అతని మీద అయితే నాకు చెడు అభిప్రాయం లేదు. వజ్రోత్సవాల సమయంలో జరిగింది నాకు గుర్తులేదు. ఆ తర్వాత కొన్నిసార్లు మేం కలిశాం. కనిపిస్తే మామూలుగానే మాట్లాడుకుంటాం. అందులో డౌట్ లేదు. మంచి కథ ఉంటే ఆయన సినిమాలో నేను విలన్ గా నటించడానికి రెడీగా ఉన్నాను. పవన్ కళ్యాణ్ తోనే కాదు ఎవరితో అయినా నటిస్తాను. నేను నటుడిని. ఏ పాత్ర అయినా చేస్తాను. ఎవరి సినిమాలోనైనా నటిస్తాను’ అని మోహన్ బాబు ఆన్సరిచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
కాగా మోహన్ బాబు విలన్ గానూ, సహాయన నటుడిగానూ బిజీ బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన నాని ది ప్యారడైజ్ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు. అలాగే అజయ్ భూపతి శ్రీనివాస మంగాపురం సినిమాలో పవర్ ఫుల్ నెగిటివ్ రోల్ చేస్తున్నారు. దివంగత నటుడు రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. త్వరలోనే ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.