సీనియ‌ర్ జ‌ర్నలిస్ట్ ఉద‌య‌గిరి ఫ‌యాజ్ ర‌చించిన ‘ర‌క్తక‌న్నీరు’ నాగ‌భూష‌ణం పుస్తకాన్ని ఆవిష్కరించిన రాజేంద్రప్రసాద్

ప్రముఖ నటుడు డా. రాజేంద్ర ప్రసాద్, ఉదయగిరి ఫయాజ్ రచించిన "రక్తకన్నీరు" నాగభూషణం పుస్తకాన్ని ఆవిష్కరించారు. నాగభూషణం గారి అద్భుతమైన నటన, సరళమైన జీవనశైలి, అపూర్వమైన డబ్బింగ్ నైపుణ్యాల గురించి ఈ పుస్తకం వివరిస్తుంది. ఈ పుస్తకం ద్వారా నేటి తరం నటులకు నాగభూషణం గొప్పతనం తెలుస్తుందని వక్తలు అన్నారు.

సీనియ‌ర్ జ‌ర్నలిస్ట్ ఉద‌య‌గిరి ఫ‌యాజ్ ర‌చించిన ‘ర‌క్తక‌న్నీరు’ నాగ‌భూష‌ణం పుస్తకాన్ని ఆవిష్కరించిన రాజేంద్రప్రసాద్
Rakta Kanneeru Nagabhushana

Updated on: Apr 26, 2025 | 3:48 PM

ప్రముఖ నటుడు నాగభూషణం జీవితంపై సీనియర్‌ జర్నలిస్ట్‌ ఉదయగిరి ఫయాజ్‌ “రక్తకన్నీరు నాగభూషణం” అనే పేరిట పుస్తకం రచించారు. ఈ పుస్తకాన్ని విలక్షణ నటుడు, నటకిరిటీ డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘‘నా జీవితంలో ఈ రోజు ఎంతో అదృష్టకరమైన రోజు. ఎందుకంటే, విశ్వవిఖ్యాత నటసౌర్వభౌమ నంద‌మూరి తార‌క రామారావుగారి ఇంట్లో పుట్టే అదృష్టాన్ని ఆ దేవుడు నాకు ప్రసాదించాడు. ఆయ‌న‌తో పాటు మ‌హామ‌హుల‌ను క‌లుసుకునే అవ‌కాశం క‌లిగింది. అందులో అతి ముఖ్యమైన వ్యక్తి నాగ‌భూష‌ణం గారు. ‘ర‌క్తకన్నీరు’ నాగ‌భూష‌ణం గారికి నాకు దగ్గరి పోలిక ఏంటంటే, నేను కామెడీని హీరోయిజం చేస్తే, ఆయ‌న విల‌నిజంలోనూ కామెడీ చేశారు. మ‌రీ ముఖ్యంగా ఆయ‌న‌కు డ‌బ్బింగ్‌లో చాలా గొప్ప పేరుంది. ఆయ‌న షూటింగ్‌లో ఏ టైమింగ్‌లో అయితే డైలాగ్ చెబుతారో అదే టైమింగ్‌తో డబ్బింగ్‌ను క‌ళ్లు మూసుకుని మ‌రీ చెప్పగలరు.

సినిమాల్లో న‌టించే రోజుల్లోనూ ఆయ‌న స్టేజ్ షోల‌ను విడిచి పెట్టలేదు. ఆయ‌న గురించి చెప్పుకుంటూ వెళితే ఎన్నో విశేషాలు చెప్పొచ్చు. అలాంటి విష‌యాల‌ను సీనియ‌ర్ జర్నలిస్ట్‌ ఫ‌యాజ్‌గారు పుస్తక రూపంలోకి తీసుకొచ్చారు. సీనియ‌ర్ న‌టులు గురించి నేటిత‌రం వాళ్లకి ఎలా తెలుస్తుంది. ఇలాంటి పుస్తకాల ద్వారానే. కాబ‌ట్టి ఫ‌యాజ్‌గారికి ఈ సంద‌ర్భంగా ధ‌న్యవాదాలు తెలియ‌జేస్తున్నాను. ఇవాళ ‘ర‌క్తక‌న్నీరు’ నాగ‌భూష‌ణం పుస్తకాన్ని వాళ్ల కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో ఆవిష్కరించే అవ‌కాశం రావ‌టం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. అంద‌రూ ఈ పుస్తకాన్ని చ‌దవాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.

ఉదయగిరి ఫ‌యాజ్ మాట్లాడుతూ ‘‘నాగ‌భూష‌ణం గారు గొప్ప న‌టులే కాదు.. అంత‌కు మించిన సంస్కారి. త‌న జీవితాన్ని అతి సామాన్యంగా గ‌డిపిన వ్యక్తి. ఆయ‌న జీవితంలో ఏ కోణాన్ని తీసుకున్నా మ‌న‌కు గొప్పగా క‌నిపిస్తుంది. ఆయ‌న ఎంత గొప్ప న‌టుడో అంత‌కు మించిన గొప్ప వ్యక్తిత్వం ఉన్న మ‌నిషి నాగ‌భూషణంగారు. ఆయ‌న గురించి పుస్తకం రాసే అవ‌కాశం క‌ల‌గ‌టం నా అదృష్టం. దాన్ని నాకెంతో ఆప్తుడైన రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా ఆవిష్కరించ‌టం మ‌రింత ఆనందాన్ని క‌లిగిస్తుంది. ఈ పుస్తక ర‌చ‌న‌లో ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఎంత‌గానో స‌హ‌క‌రించారు. ఈ సంద‌ర్భంగా వారికి నా హృద‌య‌పూర్వక‌మైన ధ‌న్యవాదాల‌ను తెలియ‌జేస్తున్నాను’’ అన్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి