OTT Movie: హీరోగా తెలంగాణ యూట్యూబర్.. విలేజ్ బ్యాక్ డ్రాప్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ ఎందులోనంటే?

తెలంగాణ నేపథ్యంలో ఇప్పటికే పలు ఆసక్తికర సినిమాలు, వెబ్ సిరీస్ లు వచ్చాయి. ఇప్పుడు ఇదే నేపథ్యంతో మరో ఆసక్తికర వెబ్ సిరీస్ తెరకెక్కింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సిరీస్ లో తెలంగాణకు చెందిన ఫేమస్ యూట్యూబర్ అనిల్ జీలా హీరోగా నటించడం విశేషం.

OTT Movie: హీరోగా తెలంగాణ యూట్యూబర్.. విలేజ్ బ్యాక్ డ్రాప్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ ఎందులోనంటే?
Telugu Web Series

Updated on: Jul 09, 2025 | 5:57 PM

అచ్చమైన, స్వచ్చమైన తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించిన మరో ఆసక్తికర వెబ్ సిరీస్ రాబోతోంది. ‘మోతెవరి లవ్ స్టోరీ’ అంటూ ప్రేమ, హాస్యం వంటి ప్రధాన అంశాలతో ఈ సిరీస్‌ను సహజంగా రూపొందించారు. అనిల్ జీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌ను శివ కృష్ణ బుర్రా రూపొందించారు. ఏడు ఎపిసోడ్స్‌గా రాబోతోన్న ఈ విలేజ్ కామెడీ, లవ్ సిరీస్ అందరినీ ఆకట్టుకునేలా ఉండబోతోంది. విలేజ్ షో మూవీస్ ఆధ్వర్యంలో తీసిన ఈ సిరీస్‌లో అనేక ట్విస్టులు ఉండబోతోన్నాయి. ఒక పెళ్లి చుట్టూ జరిగే డ్రామా అందరినీ ఈ సిరీస్‌లో ఆకట్టుకోనుంది. జూలై 9న ఈ సిరీస్‌కు సంబంధించిన పోస్టర్‌ను మేకర్లు రిలీజ్ చేశారు. నటుడు ఆనంద్ దేవరకొండ ఈ కార్యక్రమానికి హాజరై పోస్టర్, టైటిల్‌ను అధికారికంగా ఆవిష్కరించారు. లంబాడిపల్లి అనే గ్రామంలోని ఇద్దరు సోదరులు, స్వర్గస్తులైన తండ్రి ఓ మహిళకు రాసిచ్చిన ఐదు ఎకరాల భూమి, రహస్యంగా ప్రేమించుకుంటున్న సత్తయ్య కుమార్తె అనిత (వర్షిణి రెడ్డి జున్నుతుల), అనుమవ్వ మనవడు పార్షి (అనిల్ జీలా) జంట, ఈ భూ వివాదం, కుటుంబ గర్వం, వారసత్వం మధ్య సాగే ఈ సిరీస్ ఆద్యంతం అందరినీ అలరించేలా ఉంటుంది. ఈ ప్రేమకు వచ్చిన అడ్డంకులు ఏంటి? అన్నది ఆసక్తికరంగా ఉంటుంది. ఇక ఈ టైటిల్, పోస్టర్ రిలీజ్ అనంతరం..

ఈ సందర్భంగా ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ .. ‘నాకు చిన్న సినిమా, పెద్ద సినిమా.. చిన్న సిరీస్, పెద్ద సిరీస్ అని అనడం నాకు నచ్చదు. ‘మోతెవరి లవ్ స్టోరీ’ అనే టైటిల్, పోస్టర్ చాలా కొత్తగా ఉంది. నాకు ఇలా ఈవెంట్లకు రావడం కాస్త భయం. కానీ అనిల్ పిలిచిన వెంటనే రావాలని అనిపించింది. నేను యూఎస్‌లో ఉన్నప్పుడు ఎక్కువగా అక్కడి వారు మై విలేజ్ షో కంటెంట్‌ను చూసేవాళ్లు. నేను కూడా ఫాలో అయ్యేవాడ్ని. మధుర శ్రీధర్ గారు నా దొరసాని సినిమాను నిర్మించి నాకు గొప్ప అవకాశం ఇచ్చారు. ఆ మూవీకి మై విలేజ్ షో కంటెంట్ చూసే డైలాగ్స్, యాసను నేర్చుకున్నాను. నా జర్నీలో మై విలేజ్ షో టీం పాత్ర చాలా ఉంది. ఈ సిరీస్ కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ పెద్ద సక్సెస్ రావాలి. ఈ సిరీస్‌కు సీక్వెల్స్ వస్తూనే ఉండాలి. సక్సెస్ అవుతూనే ఉండాలి’ అని అన్నారు.

ఇవి కూడా చదవండి

జీ5 బిజినెస్ హెడ్ అనురాధ గూడూర్ మాట్లాడుతూ ..‘కరోనా టైంలో మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా చూసి ఆశ్చర్యపోయాను. ఆ చిత్రం నాకు చాలా ఇష్టం. వెంటనే ఆ మూవీ రైట్స్‌ను మేం కొనేశాం. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీతో సంగీత్ శోభన్‌కు స్టార్డం వచ్చింది. ఇప్పుడు ఈ సిరీస్‌తో అనిల్ గీలాకు స్టార్డం వస్తుంది. మై విలేజ్ షో టీంతో అసోసియేట్ అవ్వడం, మధుర శ్రీధర్ గారితో పని చేయడం ఆనందంగా ఉంది. గ్రామీణ రొమాంటిక్-కామెడీగా తెరకెక్కిన ఈ సిరీస్ అందరినీ మెప్పిస్తుంది’ అని అన్నారు.

జీ5 కంటెంట్ హెడ్ దేశ్ రాజ్ మాట్లాడుతూ .. ‘మా ఈవెంట్‌కు వచ్చిన ఆనంద్ అన్నకి థాంక్స్. మట్టిలో మాణిక్యం అనే దానికి మై విలేజ్ టీం ఉదాహరణ. అనిల్‌ను ఇంత వరకు యూట్యూబ్ స్టార్‌గా చూశాం. ఇప్పుడు హీరోగా అందరినీ ఈ సిరీస్‌తో ఆకట్టుకోబోతోన్నారు. తెలంగాణ యాసతో వచ్చే వెబ్ సిరీస్ ఇదే. మనల్ని కరీంనగర్, నిజామాబాద్‌కు తీసుకెళ్లినట్టుగా అనిపిస్తుంది. ప్రేమ, హాస్యంతో పాటు కొన్ని ట్విస్టులు కూడా ఉంటాయి. ఇంత తక్కువ బడ్జెట్‌లో మధుర శ్రీధర్ గారు అద్భుతంగా నిర్మించారు. మోతేవారీ సిరీస్‌కు ఇక ఫ్రాంచైజీలు వస్తూనే ఉంటాయ’ని అన్నారు.

జీ5 వైస్ ప్రెసిడెంట్ జయంత్ మాట్లాడుతూ .. ‘మధుర శ్రీధర్‌ గారితో ఒక మీటింగ్‌కే ఈ ప్రాజెక్ట్ సెట్ అయింది. అనిల్, శివ కృష్ణ చెప్పిన కథ చాలా నచ్చింది. మన గ్రామీణ మూలాల్ని టచ్ చేస్తూ సిరీస్‌ను తెరకెక్కించాం. ఈ సిరీస్ అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.

అనిల్ జీలా మాట్లాడుతూ ..‘మా ‘మై విలేజ్ షో’ టీం నుంచి మొదటి సారిగా ఇలా సిరీస్ చేశాం. మధుర శ్రీధర్ గారు మొదటి సిట్టింగ్‌కే కథను ఓకే చేశారు. జీ5 టీం వల్లే ఈ సిరీస్ ఇంత బాగా వచ్చింది. అనురాధ మేడం ఎప్పుడూ మా వెన్నంటే ఉండి సపోర్ట్ చేశారు. ఆమె ఇచ్చిన ధైర్యం వల్లే ఈ సిరీస్‌ ఇక్కడి వరకు వచ్చింది. మేం ఈ ప్రయాణంలో చాలా కష్టాల్ని ఎదుర్కొంటూనే ఎంతో నేర్చుకున్నాం. చివరకు ఓ అద్భుతమైన సిరీస్ ఆడియెన్స్‌కు అందివ్వబోతోన్నాం. మేం ఇప్పటి వరకు ఎన్నో సార్లు చూశాం. ఆద్యంతం నవ్వుకుంటూనే ఉన్నాం. నన్ను విజయ్ దేవరకొండ అన్ననే సినిమాల్లోకి తీసుకు వచ్చారు. ఇప్పుడు నా కోసం వచ్చిన ఆనంద్ అన్నకి థాంక్స్. మా సిరీస్ ఆగస్ట్ 8న రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

వర్షిణి రెడ్డి మాట్లాడుతూ .. ‘మా కోసం వచ్చిన ఆనంద్ గారికి థాంక్స్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన అందరికీ థాంక్స్. సిరీస్ చాలా కొత్తగా ఉంటుంది. అందరినీ ఆకట్టుకుంటుంది. జీ5లో మా సిరీస్ రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

గంగవ్వ మాట్లాడుతూ .. ‘మా అనిల్, శివ, శ్రీకాంత్ చాలా కష్టపడ్డారు. అందరూ ఈ సిరీస్‌ను చూసి సక్సెస్ చేయండి. జీ5లో ఈ సిరీస్ రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.