
మూవీ రివ్యూ: ఓ శాంతి శాంతి శాంతిః
నటీనటులు: తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా, బ్రహ్మాజీ, శివన్నారాయణ, బ్రహ్మానందం తదితరులు
సంగీతం: జై క్రిష్
సినిమాటోగ్రఫీ: దీపక్ యరగీర
నిర్మాతలు: సృజన్ ఎర్రబోలు
దర్శకుడు: AR సంజీవ్
కథ:
ఓంకార్ నాయుడు (తరుణ్ భాస్కర్) గోదావరి జిల్లాల్లో మంచి పేరున్న చేపల వ్యాపారి. కానీ కోపం మాత్రం ముక్కు మీదే ఉంటుంది. మరోవైపు ప్రశాంతి (ఈషా రెబ్బా) చిన్నప్పటి నుంచి ఇంట్లో కండీషన్స్ మధ్య పెరుగుతుంది. తన ఇష్టాయిష్టాలకు, స్వేచ్ఛకు అక్కడ విలువే ఉండదు. కాలేజీలో ఓ లెక్చరర్ భావాలు నచ్చి అతన్ని ఇష్టపడినా.. చివరికి అతను కూడా ఆమె స్వేచ్ఛకు అడ్డుపడతాడు. ఇంతలో ఇంట్లో వాళ్ళు ఆమెకు ఇష్టం లేకపోయినా.. మేల్ ఇగో ఉన్న ఓంకార్ నాయుడితో బలవంతంగా పెళ్లి జరిపిస్తారు. పెళ్లయ్యాక భర్త ప్రవర్తన, ప్రేమ లేని కాపురం చూసి ప్రశాంతి కుమిలిపోతుంది. ఓంకార్ ఇంట్లో తన మాటే శాసనంలా సాగాలి అనుకునే రకం. భార్య ఇంట్లో చిన్న మార్పులు చేసినా తట్టుకోలేక, ఆమెపై చేయి చేసుకోవడం మొదలుపెడతాడు. ఇక సహనం నశించిన ప్రశాంతి, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని భర్తనే చితక్కొట్టడం స్టార్ట్ చేస్తుంది. భార్య దెబ్బలకు తాళలేక, ఫిజికల్ గా ఆమెను ఎదుర్కోలేక ఓంకార్ సతమతమవుతాడు. ఆమెను తల్లిని చేస్తే దారికి వస్తుందని మామ (బ్రహ్మాజీ) ఇచ్చిన సలహాతో ఓంకార్ ఓ ప్లాన్ వేస్తాడు. మరి అది వర్కౌట్ అయ్యిందా? భర్తపై ప్రశాంతి తీర్చుకున్నది పగనా లేక ప్రేమనా? చివరకు వీరు కోర్టు మెట్లు ఎందుకు ఎక్కాల్సి వచ్చింది? అనేది మిగిలిన కథ.
కథనం:
మహిళా సాధికారత, సమానత్వం అనే బరువైన పాయింట్ని కామెడీ కోటింగ్ ఇచ్చి చెప్పే ప్రయత్నమే ఈ ఓ శాంతి శాంతి శాంతిః. గోదావరి బ్యాక్ డ్రాప్లో కథ నడవడం, అక్కడి యాస, నేటివిటీ సినిమాకి ఫ్రెష్ లుక్ ఇచ్చాయి. ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాల్లో అమ్మాయిల పెంపకంపై ఉండే ఆంక్షలను దర్శకుడు చాలా నేచురల్ గా, కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఫస్టాఫ్ అంతా పెళ్లి చూపులు, భర్త పెత్తనం, ఆ గొడవలతో సరదాగా సాగిపోతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే చిన్న ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ఇక సెకండాఫ్లో సీన్ రివర్స్ అయ్యి భర్తని భార్య కొట్టడం, ఆ బాధని ఓంకార్ బయటకి చెప్పుకోలేక పడే పాట్లు నవ్వులు పూయిస్తాయి. అయితే, సినిమాని పూర్తిగా కామెడీ వైపు మళ్లించే ప్రయత్నంలో ఎమోషన్ మిస్ అయ్యింది. కొన్ని సన్నివేశాలు సాగదీసినట్టుగా అనిపిస్తాయి. స్క్రీన్ ప్లేలో ఉండాల్సిన టైట్ నెస్ లోపించింది. అక్కడక్కడా వచ్చే కామెడీ సీన్స్ పర్వాలేదనిపించినా.. సినిమా మొత్తం ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడంలో విఫలమైంది. క్లైమాక్స్ లో బ్రహ్మానందం ఎంట్రీ కాస్త రిలీఫ్ ఇచ్చినా.. ముగింపు హడావిడిగా ముగించేసిన ఫీలింగ్ కలుగుతుంది. క్యారెక్టర్స్ తో ఎమోషనల్ గా కనెక్ట్ కాలేకపోవడం ఈ సినిమాకి పెద్ద మైనస్. ఒరిజినల్ సినిమా చూసిన వాళ్లకు ఇది కిక్ ఇవ్వదు గానీ చూడని వాళ్ళు మాత్రం ఎంజాయ్ చేయొచ్చు.
నటీనటులు:
ఈ సినిమాకి ప్రధాన బలం కాస్టింగ్. ఓంకార్ నాయుడిగా తరుణ్ భాస్కర్ ఇరగదీశాడు. గోదావరి యాసలో డైలాగ్ డెలివరీ.. ఆ యాటిట్యూడ్, ఫ్రస్ట్రేషన్ ని పర్ఫెక్ట్ గా పండించాడు. ఇక ఈషా రెబ్బా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సినిమాకి అసలు హీరో తనే. చాలా సెటిల్డ్ గా నటిస్తూనే, యాక్షన్ సీక్వెన్స్లో అదరగొట్టింది. నటిగా ఆమెకు ఇది బెస్ట్ సినిమా అవుతుంది. మామ పాత్రలో బ్రహ్మాజీ తన మార్క్ కామెడీ టైమింగ్ తో నవ్వించే ప్రయత్నం చేశాడు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు బాగానే చేశారు.
టెక్నికల్ టీం:
జయ్ క్రిష్ పాటలు సోసోగానే ఉన్నా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది. దీపక్ యరగీర పనితనం బాగుంది. గోదావరి అందాలను, పల్లెటూరి వాతావరణాన్ని చాలా నేచురల్ గా చూపించారు. సినిమా లెంగ్త్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడి ఉండాల్సింది. అక్కడక్కడా కత్తెర వేయాల్సిన సీన్లు ఉన్నాయి. సినిమా క్వాలిటీ పరంగా రిచ్ గానే ఉంది. ఏఆర్ సజీవ్ ఎంచుకున్న పాయింట్.. ఇవ్వాలనుకున్న మెసేజ్ చాలా బాగుంది. కానీ దాన్ని తెరపైకి ఎమోషనల్ గా, ఎంగేజింగ్ గా తెచ్చే ప్రయత్నం చేశాడు. కామెడీ ఇంకాస్త బాగా వర్కౌట్ చేసి ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేది.
పంచ్ లైన్:
ఓవరాల్ గా ఓం శాంతి శాంతి శాంతిః.. నైస్ హ్యూమర్ విత్ గుడ్ మెసేజ్..!