
మూవీ రివ్యూ: మృత్యుంజయ్
నటీనటులు: శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్, బాల ఆదిత్య, సుదర్శన్, రచ్చ రవి, అయ్యప్ప పి. శర్మ తదితరులు..
సంగీతం: కాల భైరవ
సినిమాటోగ్రఫీ: విద్యా సాగర్ చింత
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
దర్శకుడు: హుస్సేన్ షా కిరణ్
నిర్మాతలు: సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి
జై (శ్రీవిష్ణు) ఓ దినపత్రికలో అడ్వర్టైజ్మెంట్స్ తీసుకొచ్చే ఉద్యోగం చేస్తుంటాడు. ఎప్పటికైనా మంచి క్రైమ్ రిపోర్టర్ అవ్వాలన్నది అతని కల. అయితే తనకున్న టార్గెట్స్ కోసం చనిపోయిన వారి ఇళ్లకు వెళ్లి వాళ్ళ చేత పేపర్లో శ్రద్ధాంజలి యాడ్స్ వేయిస్తుంటాడు. ఆ క్రమంలో ఒకసారి అచ్యుత్ రావ్ (బాల ఆదిత్య) అనే వ్యక్తి కరెంట్ షాక్ కొట్టి చనిపోతే ఆ ఇంటికి వెళ్తాడు. అక్కడ అచ్యుత్ కూతురు అంజలి ఏడవకుండా దీనంగా ఉండటం జైని కదిలిస్తుంది. నీ తండ్రి మరణానికి గల కారణం కనుక్కుంటానని ఆ పాపకు మాటిస్తాడు. సరిగ్గా అదే సమయంలో మరో వ్యక్తి కూడా అనుమానాస్పదంగా చనిపోతాడు. ఈ రెండు కేవలం ప్రమాదాలు కావని, పక్కా ప్లాన్తో జరిగిన హత్యలని జైకి అనుమానం వస్తుంది. ఈ రెండు కేసులను డీల్ చేస్తున్న ఏసీపీ సీత పరశురాం (రెబా మోనికా జాన్)కి హీరో తన ఇన్వెస్టిగేషన్తో ఎలా సాయపడ్డాడు? అసలు ఎలాంటి క్లూ వదలకుండా ఆ హత్యలు చేస్తున్న ఆ కనిపించని హంతకుడు ఎవరు? అతని వెనుక ఉన్న అదృశ్య శక్తులు ఎవరు? అనేది మిగతా కథ.
థ్రిల్లర్ సినిమాలకు స్క్రీన్ ప్లే అత్యంత కీలకం. నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఉత్కంఠను రేకెత్తించడంలో దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ సక్సెస్ అయ్యాడు. సినిమా మొదలైన పది నిమిషాలకే అసలు కథలోకి తీసుకెళ్లిపోవడం, అనవసరమైన కామెడీ ట్రాక్స్, పాటలు ఇరికించకుండా కంటెంట్కి కట్టుబడి సినిమాను నడపడం అతిపెద్ద ప్లస్ పాయింట్. ముఖ్యంగా సెకండాఫ్లో హీరో, విలన్ మధ్య నడిచే మైండ్ గేమ్ ఆడియన్స్ను సీట్ ఎడ్జ్లో కూర్చోబెడుతుంది. విలన్ ఎవరు అనేది ప్రేక్షకులకు ముందే తెలిసినా, హీరో అతన్ని ఎలా ట్రాక్ చేసి పట్టుకుంటాడనే ప్రాసెస్ చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. అయితే క్లైమాక్స్లో హంతకుడికి డీల్ ఇచ్చిన అసలు వ్యక్తులు ఎవరు, ఎందుకు ఈ హత్యలు చేయించారు అనే మోటివ్ను ఇంకాస్త బలంగా, క్లియర్గా వివరించి ఉంటే బాగుండేది అనిపిస్తుంది.
క్లైమాక్స్ డీటెయిలింగ్లో కాస్త క్లారిటీ మిస్ అవ్వడం, రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఆశించే వారికి ఈ సినిమా నచ్చకపోవచ్చు. వరుస కామెడీ సినిమాలతో కొంచెం గ్యాప్ తీసుకున్న శ్రీవిష్ణు, మళ్లీ తన స్ట్రాంగ్ జోన్ అయిన ‘కంటెంట్ ఓరియెంటెడ్’ సినిమాతో కంబ్యాక్ ఇచ్చాడు. ఎలాంటి డీవియేషన్స్ లేకుండా, ఆద్యంతం ఆసక్తికరమైన మైండ్ గేమ్తో సాగే ‘మృత్యుంజయ్’.. థ్రిల్లర్ జానర్ను ఇష్టపడే వారికి ఒక పర్ఫెక్ట్ వాచ్.
శ్రీవిష్ణు తన రెగ్యులర్ కామెడీ ఇమేజ్ను పక్కనపెట్టి ‘జై’ పాత్రలో చాలా సెటిల్డ్గా నటించాడు. ఒక సిన్సియర్ అండ్ సీరియస్ రోల్ను అతను క్యారీ చేసిన విధానం మెప్పిస్తుంది. ఏసీపీ సీత పాత్రలో రెబా మోనికా జాన్ నీట్గా సరిపోయింది. పోలీస్ ఆఫీసర్గా ఆమె బాడీ లాంగ్వేజ్ బాగుంది. బాల ఆదిత్య, సుదర్శన్ తమ పాత్రల పరిధి మేర చక్కగా నటించారు. మిగిలిన వాళ్ళు ఓకే.
ఈ తరహా మర్డర్ మిస్టరీలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రాణం పోస్తుంది. కాల భైరవ తన బీజీఎమ్తో ప్రతి సీన్లోనూ టెన్షన్ క్రియేట్ చేస్తూ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. విద్యా సాగర్ చింత సినిమాటోగ్రఫీ మూడ్కి తగ్గట్టుగా డార్క్ అండ్ ఇంటెన్స్గా ఉంది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ షార్ప్గా ఉండటం వల్ల ఎక్కడా బోరింగ్ మూమెంట్స్ రావు. సందీప్ గుణ్ణం నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా చాలా రిచ్గా ఉన్నాయి.
ఓవరాల్ గా మృత్యుంజయ్.. డీసెంట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్..!