లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా షూటింగ్లు చేసుకునేందుకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అనుమతిని ఇచ్చాయి. అయితే రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో సినీ ప్రముఖులు షూటింగ్లపై పెద్ద ఆసక్తిని చూపడం లేదు. ఈ క్రమంలో కొంతమంది హీరోలు ఇప్పట్లో సెట్స్ మీదకు వెళ్లకూడదని అనుకుంటున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అందులో ముఖ్యంగా సూపర్స్టార్ మహేష్ బాబు పేరు వినిపిస్తోంది.
పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు సర్కారు వారి పాటలో నటించాల్సి ఉండగా.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో డిసెంబర్ వరకు ఈ మూవీ షూటింగ్లో పాల్గొననని ఆయన నిర్మాతలకు చెప్పేశారట. ఆ లోపు కావాలనుకుంటే తన పాత్రతో సంబంధం లేని టాకీ పార్ట్ను పూర్తి చేసుకోమని వారికి సూచించారట. దీంతో దర్శకనిర్మాతలు ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మరోవైపు చిరంజీవి కూడా సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్దంగా లేరని సమాచారం. పని ముఖ్యం.. కానీ ప్రాణం అంతకంటే ముఖ్యమని ఇటీవల ఓ వీడియోలో సైతం చెప్పిన మెగాస్టార్.. కొరటాలను మరికొన్ని రోజులు ఆగమని చెప్పారట. ఇక ఇదే దారిలోనే వెంకటేష్, నాని తదితర హీరోలు ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా విపత్కర పరిస్థితుల్లో రిస్క్ చేయకపోవడమే మంచిదని వారందరూ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఇక్కడే కాదు బాలీవుడ్లోనూ పలువురు స్టార్ హీరోలు షూటింగ్లకు రెడీగా లేనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాను షూటింగ్లకు రానని, తన కుమార్తెను కూడా పంపనని ప్రముఖ నటుడు శక్తి కపూర్ స్టేట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే.
Read This Story Also: ఆరోపణలు చేసే ముందు ఆలోచించండి: బీజేపీ నేతలపై ఈటెల మండిపాటు