
ఈ సినిమా విషయంలో హృతిక్ రోషన్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత భాగాలను తన తండ్రి రాకేష్ రోషన్ తెరకెక్కించగా, ఈ నాలుగో భాగానికి మాత్రం హృతిక్ స్వయంగా దర్శకత్వం వహించబోతున్నారు. హీరోగానే కాకుండా దర్శకుడిగా కూడా తన ప్రతిభను చాటుకోవాలని ఆయన సిద్ధమయ్యారు.
బాలీవుడ్ గ్రీకు వీరుడిగా పేరుతెచ్చుకున్న హృతిక్ రోషన్ కు ‘క్రిష్’ సిరీస్ అంటే ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్. గతంలో వచ్చిన మూడు సినిమాలను హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ తెరకెక్కించారు. అయితే ‘క్రిష్ 4’ విషయంలో మాత్రం ఒక ఆసక్తికర మలుపు చోటు చేసుకుంది. ఈ సినిమాకు స్వయంగా హృతిక్ రోషనే దర్శకత్వం వహించబోతున్నారట. అంతేకాకుండా ఈ సినిమా కథను కూడా ఆయనే సిద్ధం చేయడం విశేషం. ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్స్తో, అత్యున్నత సాంకేతిక విలువలతో తీర్చిదిద్దాలని హృతిక్ పట్టుదలతో ఉన్నారు.
Hrithik Roshan And Father
క్రిష్ సిరీస్ కు ఉన్న డిమాండ్ చూసి బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ ఈ ప్రాజెక్టులో భాగస్వామి కావాలని భావించింది. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది. హృతిక్ తన విజన్ కు తగ్గట్టుగా సినిమా రావాలంటే సుమారు రూ.500 కోట్ల వరకు బడ్జెట్ అవుతుందని నిర్మాణ సంస్థను కోరారట. గ్రాఫిక్స్, అంతర్జాతీయ టెక్నీషియన్ల కోసం ఈ మొత్తం తప్పనిసరి అని ఆయన వివరించినట్లు తెలుస్తోంది. కానీ యష్ రాజ్ సంస్థ మాత్రం ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. కేవలం రూ.350 కోట్లలోనే సినిమాను పూర్తి చేయాలని హృతిక్ కు కండిషన్ పెట్టినట్లు సమాచారం.
క్రిష్ వంటి భారీ సినిమాను కేవలం రూ.350 కోట్లతో హాలీవుడ్ స్థాయిలో తీయడం అసాధ్యమని హృతిక్ భావిస్తున్నారట. మరి ఈ క్లిష్ట పరిస్థితుల్లో హృతిక్ తన బడ్జెట్ ను తగ్గించుకుని సినిమాను పట్టాలెక్కిస్తారా? లేక యష్ రాజ్ సంస్థను కాదని మరో నిర్మాతను వెతుక్కుంటారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.