Sushant Case: రంగంలోకి సీబీఐ.. రియాపై ఎఫ్‌ఐఆర్‌

బాలీవుడ్ నటుడు సుశాంత్‌ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసును విచారణకు తీసుకున్న సీబీఐ.. నటి, సుశాంత్‌ లవర్‌ రియా చక్రవర్తిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది

Sushant Case: రంగంలోకి సీబీఐ.. రియాపై ఎఫ్‌ఐఆర్‌

Edited By:

Updated on: Aug 06, 2020 | 9:13 PM

CBI registers FIR in Sushant’s death probe: బాలీవుడ్ నటుడు సుశాంత్‌ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసును విచారణకు తీసుకున్న సీబీఐ.. నటి, సుశాంత్‌ లవర్‌ రియా చక్రవర్తిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. రియాతో పాటు ఆమె తండ్రి ఇంద్రజిత్‌ చక్రవర్తి, తల్లి సంధ్య చక్రవర్తి, సోదరుడు షోవిక్‌ చక్రవర్తి, సుశాంత్ ఇంటి మేనేజర్‌ శామ్యూల్‌ మిరింద, రియా చక్రవర్తి మాజీ మేనేజర్ శ్రుతీ మోదీలతో పాటు పలువురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

కాగా జూన్‌ 14న ముంబయిలోని తన నివాసంలో సుశాంత్‌ ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు. పోస్ట్‌మార్టం రిపోర్టులోన సుశాంత్‌ది ఆత్మహత్యగా తేలింది. అయితే అతడి మృతిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. సుశాంత్‌ది ఆత్మహత్య కాదని హత్య అని అభిమానులు సహా పలువురు ప్రముఖులు ఆరోపణలు చేశారు. ఇక ఈ కేసును విచారిస్తోన్న ముంబయి పోలీసులు పలువురిని విచారించి, స్టేట్‌మెంట్‌లను రికార్డు చేశారు. మరోవైపు సుశాంత్ తండ్రి కేకే సింగ్‌ సుశాంత్‌ కేసులో నటి రియా సహా పలువురిపై బీహార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో వారు తమ విచారణను ప్రారంభించారు. అలాగే తన కుమారుడి అకౌంట్ల నుంచి దాదాపు 15కోట్లు మిస్ అయ్యాయని కేకే సింగ్‌ ఫిర్యాదు ఇవ్వడంతో.. ఈడీ రంగంలోకి దిగింది. ఈ క్రమంలో ముంబయి పోలీసులు వర్సెస్ బీహార్ పోలీసులుగా సుశాంత్‌ కేసు మారింది. ఇదే క్రమంలో ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ బీహార్ ప్రభుత్వం, కేంద్రాన్ని కోరింది. అందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో.. తాజాగా సీబీఐ పలువురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. మరి ఈ కేసులో నిజానిజాలు త్వరలోనైనా తెలుస్తాయోమో చూడాలి.

Read This Story Also: ఏపీ కరోనా అప్‌డేట్స్‌: 10,328 కొత్త కేసులు.. 72 మరణాలు