Aamir Khan: ఈసారి అలాంటివేవీ ఉండవు.. మూడో పెళ్లి ప్లాన్స్ గురించి ఓపెన్గా చెప్పేసిన ఆమిర్ ఖాన్
ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ మూడవసారి పెళ్లి చేసుకోబోతున్నారు. కొద్ది రోజులుగా గౌరీతో ప్రేమలో ఉన్న ఆయన ఇప్పుడు తన పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.అంతేకాదు తన మూడో వివాహం ఎలా జరగబోతుందో ఆయన వెల్లడించారు. కేవలం ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఆమిర్ ఖాన్, గౌరీ.

బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ తన వ్యక్తిగత జీవితం కారణంగా మరోసారి వార్తల్లో నిలిచారు . గత కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్న పెళ్లి పుకార్లపై ఆమిర్ ఖాన్ స్వయంగా స్పష్టతనిచ్చారు. తాను త్వరలో తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్ను వివాహం చేసుకోబోతున్నట్లు ఆయన ధృవీకరించారు . ఈ జంట జూలై 5న వివాహం చేసుకోనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయాన్ని ఆమిర్ ఖాన్ అంగీకరించారు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూకు హాజరైన ఆమిర్ ఖాన్ తన పెళ్లి ప్రణాళికల గురించి వెల్లడించారు. ‘మా ఇంట్లోనే చాలా నిరాడంబరంగా రిజిస్టర్ మ్యారేజ్ జరగనుంది. పెళ్లికి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరవుతారు. మేమిద్దరం ఈ శుభ కార్యాన్ని చాలా నిరాడంబరంగా జరుపుకోవాలని ముందుగానే నిర్ణయించుకున్నాం’ అని చెప్పుకొచ్చారీ బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్.
61 ఏళ్ల ఆమిర్ ఖాన్కు ఇది మూడవ వివాహం. ఆయన మొదటి భార్య రీనా దత్తా. ఆమిర్, రీనాలకు జునైద్ ఖాన్, ఇరా ఖాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. రీనాకు విడాకులు ఇచ్చిన తర్వాత, ఆమిర్ ఖాన్ కిరణ్ రావును వివాహం చేసుకున్నారు. 16 ఏళ్ల వివాహ బంధం తర్వాత, ఆయన కిరణ్ రావు నుండి కూడా విడిపోయి మూడవసారి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. విడాకుల తర్వాత కూడా, ఆమిర్ ఖాన్ తన ఇద్దరు మాజీ భార్యలతో మంచి సంబంధాలను కొనసాగిస్తున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే, ఆమిర్ ఖాన్ గత సంవత్సరం ఆర్.ఎస్. ప్రసన్న దర్శకత్వంలో వచ్చిన ‘సితారే జమీన్ పర్’ చిత్రంలో చివరిసారిగా కనిపించారు. ఇది స్పానిష్ భాషా చిత్రం ‘ఛాంపియన్స్’కు రీమేక్. ఇది కాకుండా, రజనీకాంత్ నటించిన ‘కూలీ’, ‘హ్యాపీ పటేల్’ చిత్రాలలో ఆమిర్ ఖాన్ అతిథి పాత్రలు పోషించారు. అమితు ఆమిర్ ఖాన్ ఈ మధ్య నటన కంటే సినిమా నిర్మాణంపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఆయన ‘ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్’ ద్వారా విభిన్నమైన, స్ఫూర్తి దాయక సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు ఈ నిర్మాణ సంస్థ నుంచి ఒక డాక్యుమెంటరీ రాబోతోంది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవిత కథ ఆధారంగా ఆమిర్ ఖాన్ నిర్మాణ సంస్థ ఒక ప్రత్యేక డాక్యుమెంటరీని రూపొందించడానికి ప్రణాళిక వేస్తున్నట్లు సమాచారం. ప్రముఖ రచయిత్రి, దర్శకురాలు స్వాతి చక్రవర్తి ఈ డాక్యుమెంటరీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఒడిశాలోని ఒక చిన్న గ్రామం నుంచి దేశంలోనే అత్యున్నత రాజ్యాంగ పదవి అయిన రాష్ట్రపతి పీఠం వరకు ద్రౌపది ముర్ము ప్రస్థానాన్ని ఈ డాక్యుమెంటరీ ఆవిష్కరించనుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




