
ప్రముఖ భారతీయ డ్యాన్సర్, దివంగత ఉదయ్ శంకర్(నాట్యకారుడు) సతీమణి అమలా శంకర్(101) ఇక లేరు. శుక్రవారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. 1919లో జెస్సోరీ(ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్న ఓ ప్రాంతం)లో అమలా జన్మించారు. 1930 నుంచి అమలా డ్యాన్స్ని నేర్చుకున్నారు. ఇక 1931లో పారిస్లోని ఇంటర్నేషనల్ కోలోనియల్ ఎగ్జిబిషన్లో అమలా, ఉదయ్ శంకర్ని మొదటి సారిగా కలిశారు. ఆ తరువాత ఉదయ్ శంకర్ డ్యాన్స్ గ్రూప్లో చేరిన అమలా.. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రదర్శనలు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఉదయ్, అమలా మధ్య ప్రేమ చిగురించగా.. 1942లో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. పెళ్లి తరువాత కూడా ఈ ఇద్దరు తమ ప్రదర్శనలను కొనసాగించారు. అంతేకాదు ఎంతోమందికి అమలా డ్యాన్స్ను నేర్పించారు. ఇదిలా ఉంటే ఆమె మరణవార్తపై స్పందిస్తోన్న పలువురు అమలా కుటుంబానికి సంతాపం ప్రకటిస్తున్నారు.