
టాలీవుడ్ హీరోయిన్ ఆమని, దివంగత నటి సౌందర్యతో తనకున్న స్నేహబంధాన్ని, ఆమె మరణం తనపై చూపిన ప్రభావాన్ని భావోద్వేగంతో పంచుకున్నారు. సౌందర్య తనకు కేవలం సహనటి మాత్రమే కాదని, జీవితంలో చాలా దగ్గరైన స్నేహితురాలని ఆమని వెల్లడించారు. సౌందర్య తన పర్సనల్ విషయాలన్నీ పంచుకునే వ్యక్తి అని, తామిద్దరం చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అని అన్నారు. షూటింగ్స్ లేనప్పుడు ఇంటికి పిలవడం, స్వీయ నిర్మాణంలో రూపొందుతున్న సినిమా సెట్కు వచ్చి ప్రోత్సహించమని అడగడం వంటి మధుర స్మృతులను ఆమని గుర్తు చేసుకున్నారు. సౌందర్య మరణ వార్త తనను తీవ్రంగా కలచివేసిందని ఆమని చెప్పారు. “నేను నమ్మలేదు. ఎవరో ఊరికే చెబుతున్నారు అనుకున్నా. నేను షూటింగ్లో ఉండగా ఆ వార్త తెలిసింది. నా చేతులు వణికాయి. మాట రాలేదు. మీడియా మైక్ పెట్టి అడిగినా ఏడుపు తప్ప ఏమీ రాలేదు” అని ఆమని ఆనాటి సంఘటనను వివరించారు. మరణించిన తర్వాత వెళ్లి చూడడానికి ఏమి ఉందని, ఆ దుఃఖాన్ని తట్టుకోలేమని భావించి, నెల రోజుల తర్వాత ఆమె ఇంటికి వెళ్ళినట్లు ఆమని తెలిపారు. అక్కడ సౌందర్య తల్లిగారు మాత్రమే ఉన్నారని, హాల్ లో సౌందర్య, ఆమె తండ్రి, తమ్ముడు అమర్ ఫోటోలు ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత కొన్నేళ్లకు సౌందర్య కుటుంబంలో జరిగిన పరిణామాలను ప్రస్తావించారు. జగపతి బాబు గారి ద్వారా సౌందర్య తల్లి కూడా రెండేళ్ల క్రితం చనిపోయారని తెలిసిందని, ఇప్పుడు అమర్ కొడుకు మాత్రమే మిగిలాడని ఆమని ఆవేదన వ్యక్తం చేశారు. బెంగళూరులోని సౌందర్య ఇంటికి ఇటీవల వెళ్ళినప్పుడు అది నిర్మానుష్యంగా, బూజు పట్టి, బూత్ బంగ్లాగా మారిపోయిందని, ఎవరూ లేరని తెలిసి తీవ్ర ఆవేదనకు గురయ్యానని చెప్పారు.
సౌందర్య వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ, ఆమె తెరపై ఎంత అందంగా ఉంటుందో, నిజ జీవితంలో అంతకంటే ఎక్కువగా దేవతలా ఉండేదని ఆమని అభివర్ణించారు. “దేవతగానే వెళ్ళిపోయింది. మంచి క్యారెక్టర్ ఉన్న అమ్మాయి” అని అన్నారు. సౌందర్యకు ఒక పద్ధతి ప్రకారం జీవించడం అలవాటని, “లైఫ్ ఇలాగే ఉండాలి, ఇలాగే ఉంటాను” అనే నియమం ఆమెదని ఆమని గుర్తు చేసుకున్నారు. తన తండ్రి అంటే సౌందర్యకు చాలా ఇష్టమని, ఆయన ఏది చెబితే అది చేసేదని, చిన్నప్పుడు స్వీట్లు తినొద్దంటే మానేసేదని తెలిపారు.
ఇదే ఇంటర్వ్యూలో ఆమని తన సహనటులైన కార్తికేయ, ప్రకాష్ రాజ్, నాగార్జున, కమల్ హాసన్, రోజా లతో పనిచేసిన అనుభవాలను కూడా పంచుకున్నారు. కార్తికేయ పెద్ద పెద్ద డైలాగ్స్ సింగిల్ టేక్లో చెప్పేయడం చూసి తాను ఆశ్చర్యపోయానని, ఆయన పక్కన పనిచేస్తున్నప్పుడు తాను మరింత అప్రమత్తంగా ఉండేదాన్ని అని తెలిపారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : తొలి సూపర్ స్టార్ కమెడియన్.. ఖరీదైన కారులో ప్రయాణించి.. 44 ఏళ్ళ వయసులోనే రైల్వే స్టేషన్ రోడ్డు మీద అనాథలా..