Abhishek Banerjee: తృణమూల్ విజయం వెనుక శక్తి అతనే.. మేనత్తకు అండగా మేనల్లుడు

|

May 03, 2021 | 3:53 PM

మూడు దశాబ్దాల పాటు బెంగాల్‌లో రాజ్యమేలిన కమ్యూనిస్టు కథకు తాజా ఎన్నికల్లో ఎండ్ కార్డు పడింది. ఒక్కటంటే ఒక్కటి అది కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసి కూడా గెలవలేకపోయారు ఎర్ర సోదరులు. అయితే.. టీఎంసీ పార్టీ ఘన విజయం వెనుక వున్న దెవరు?

Abhishek Banerjee: తృణమూల్ విజయం వెనుక శక్తి అతనే.. మేనత్తకు అండగా మేనల్లుడు
Follow us on

Abhishek Banerjee behind TMC victory: పశ్చిమ బెంగాల్లో (WEST BENGAL)అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (TRINAMOOL CONGRESS) హ్యాట్రిక్ విజయం సాధించింది. బొటాబొటి మెజార్టీతో గెలిచే అవకాశం ఉందన్న ఎగ్జిట్ పోల్స్ (EXIT POLLS) అంచనాలు తప్పాయి. బీజేపీ (BJP)పై తృణమూల్ సంపూర్ణ ఆధిక్యం సాధించింది. మొత్తం 292 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. టీఎంసీ (TMC) 213 స్థానాల్లో గెలుపొంది తిరుగులేని విజయాన్ని సాధించింది. ఇక బీజేపీ కూడా తక్కువేం తినలేదు. గత ఎన్నికల్లో కేవలం 3 సీట్లకు పరిమితమైన కమలం పార్టీ ఈసారి ఏకంగా దీదీతో ఢీ అంటే ఢీ అంటూ ఏకంగా 77 స్థానాలను కైవసం చేసుకుంది. అయితే.. మూడు దశాబ్దాల పాటు బెంగాల్‌లో రాజ్యమేలిన కమ్యూనిస్టు కథకు తాజా ఎన్నికల్లో ఎండ్ కార్డు పడింది. ఒక్కటంటే ఒక్కటి అది కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసి కూడా గెలవలేకపోయారు ఎర్ర సోదరులు. అయితే.. టీఎంసీ పార్టీ ఘన విజయం వెనుక వున్న దెవరు? ఇదిపుడు పెద్ద చర్చకు తెరలేపింది.

2019 నాటి పార్లమెంటు ఎన్నికల్లో బెంగాల్‌లో బీజేపీ సాధించిన 18 లోక్‌సీట్లను చూసి ఖంగుతిన్న మమతా బెనర్జీ (MAMATA BANERJEE).. ఆనాటి నుంచే 2021 అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ (PRASHANTH KISHORE)తో పొలిటికల్ అగ్రిమెంటు కుదుర్చుకున్నారు. తాను 2021 ఎన్నికల్లో గెలిచే వ్యూహాన్ని ప్రశాంత్ కిశోర్ నుంచి పొందారు. అందుకుగాను సుమారు 150 కోట్ల రూపాయలను ప్రశాంత్ కిశోర్ సంస్థకు దీదీ ముట్టచెప్పారని కొన్ని మీడియా సంస్థలు పేర్కొన్నారు. అయితే.. దీదీకి ప్రశాంత్ కిశోర్ అందించిన వ్యూహాన్ని ఖచ్చితంగా అమలు పరిచింది మాత్రం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ (ABHISHEK BANERJEE) మాత్రమే. తన మేనత్త వెంట అనుంగ సహచరునిగా మారిన అభిషేక్.. గత నాలుగు నెలలుగా కంటి మీద కునుకు లేకుండా తృణమూల్ కాంగ్రెస్ విజయం కోసం అహర్నిశలు శ్రమించారు. తృణమూల్ కాంగ్రెస్ విజయంలో కీలకపాత్ర పోషించారు అభిషేక్ బెనర్జీ.

ఎంపీ అభిషేక్ బెనర్జీ… మమతా బెనర్జీ మేనల్లుడు (MAMATA BANERJEE NEPHEW). ఇప్పుడు బెంగాల్ వ్యాప్తంగా ఇదే పేరు వినిపిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఎలాగైనా బెంగాల్‌లో పాగా వేయాలని ప్రయత్నించింది. నరేంద్ర మోదీ (NARENDRA MODI), అమిత్ షా (AMITH SHAH) వంటి నేతలు విస్తృతంగా పర్యటనలు జరిపి ప్రచారం చేసినా, అనుకున్న స్థాయిలో విజయం మాత్రం దక్కలేదు. టీఎంసీ గెలుపు వెనుక అభిషేక్ బెనర్జీదే కీలక పాత్రని చెప్పడంలో సందేహాం లేదు. అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక, ప్రచారానికి రోడ్ షోల ప్లాన్ సిద్ధం చేయడం నుంచి ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ అభిషేక్ తన మేనత్త మమతా బెనర్జీ వెన్నంటి నిలిచారు. మోదీ, అమిత్ షా వంటి వారు సైతం తమ ప్రచారంలో అభిషేక్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారంటే, తృణమూల్ కాంగ్రెస్ లో ఆయన పరపతి, శక్తి సామర్థ్యాలను ఊహించుకోవచ్చు.

ఎన్నికల ముందు తృణమూల్ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన సువేందు అధికారి (SUVENDU ADHIKARI)తో పాటు వైశాలీ దాల్మియా (VAISHALI DALMIA), రాజీవ్ బందోపాధ్యాయ (RAJEEV BANDOPADHYAYA) వంటి వారు, తాము అభిషేక్ వల్లనే పార్టీని వీడుతున్నామని స్పష్టం చేశారు. దీంతో తృణమూల్‌లోని కొందరు నేతలు అభిషేక్ పెత్తనంపై అభ్యంతరాలు, అసంతృప్తి వ్యక్తం చేశారు. వీటిని అటు మమత, ఇటు అభిషేక్ ఏ మాత్రమూ పట్టించుకోలేదు. తన మేనల్లుడిపై పూర్తి విశ్వాసం ఉంచిన మమత ఆయనకే ప్రచార బాధ్యతల్లో పెద్దపీట వేశారు. మమతా బెనర్జీ కాలికి గాయం కాగానే, అన్నీ తానై ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లారు. మమతా బెనర్జీ రోడ్ షోలు రద్దయిన ప్రాంతాల్లో ప్రత్యేక సభలు పెట్టి ఓటర్లకు పార్టీ విజయం సాధించడంలో అభిషేక్ బెనర్జీ కీలకపాత్ర వహించారు.

ALSO READ: బెంగాల్ ఎన్నికల విశ్లేషణలో ఆసక్తికర అంశాలెన్నో… తృణమూల్ విజయం వెనుక మర్మమిదే?