UP Elections 2022: రేపే యూపీలో చివరి విడత ఎన్నికలు, వారణాసిపైనే అందరి దృష్టి..
యావత్ భారతావని ఉత్కంఠగా, అంతకు మించిన ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు క్లయిమాక్స్కు చేరుకున్నాయి.. ఓటరు మహాశయులు ముగింపును ఎలా ఇవ్వబోతున్నారన్న టెన్షన్ అటు అధికార పక్షమైన బీజేపీకి..

UP Elections 2022: యావత్ భారతావని ఉత్కంఠగా, అంతకు మించిన ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు క్లయిమాక్స్కు చేరుకున్నాయి.. ఓటరు మహాశయులు ముగింపును ఎలా ఇవ్వబోతున్నారన్న టెన్షన్ అటు అధికార పక్షమైన బీజేపీకి ఎంత ఉందో, అంతకు రెట్టింపు విపక్షమైన సమాజ్వాదీ పార్టీకి వుంది. అందుకు కారణం విజయం రెండు పార్టీలకు అత్యంత కీలకంగా మారడం. దేశ రాజకీయాలను శాసించే ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు గెలిస్తే రాబోయే సార్వత్రిక ఎన్నికలకు రెట్టించిన ఉత్సాహంతో వెళ్లవచ్చన్నది బీజేపీ ఆలోచన. భారతీయ జనతాపార్టీని ఓడించడం పెద్ద కష్టమైన పనికాదన్న విషయాన్ని ఇంతకు ముందు నిరూపించిన నేతల జాబితాలో తను కూడా చేరాలన్నది ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ భావన. ఉత్తరప్రదేశ్లో కాషాయ జెండా ఎగురవేస్తామంటూ ప్రధాని నరేంద్రమోదీ కాన్ఫిడెన్స్తో ఉన్నప్పటికీ స్థానిక బీజేపీ నేతల్లో మాత్రం ఏదో సంశయం.
ఉత్తరప్రదేశ్లో అధికారం ఎవరిదో తేల్చబోయే చిట్టచివరి దశ పోలింగ్ రేపు జరగనుంది. పూర్వాంచల్లో తొమ్మిది జిల్లాల్లోని 54 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆజంగఢ్, మీర్జాపూర్, మౌవ్, జాన్పూర్, ఘాజీపూర్, చన్దౌలి, భదోహి, సోన్భద్ర జిల్లాలు ఎన్నికలకు సిద్ధం అయ్యాయి. ప్రధాని నరేంద్రమోదీ నియోజకవర్గం వారణాసి కూడా పూర్వాంచల్లో భాగమే కాబట్టి బీజేపీ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రధాని కూడా గట్టిగానే ప్రచారం చేశారు. మూడు రోజుల పాటు వారణాసిలో ఉన్నారాయన. వారణాసిలో మేథావులు, ప్రముఖులతో మాట్లాడారు. ఉత్తరప్రదేశ్లో అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ బీజేపీకే అవకాశం ఇవ్వాలని వారిని కోరారు. రోడ్షోలలో పాల్గొని క్యాడర్ను ఉత్సాహపరిచారు.
ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ కూడా క్షణం వృధా చేయకుండా ప్రచారంలో పాల్గొన్నారు. అఖిలేశ్కు మద్దతుగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ప్రచారం చేశారు. గతమెంతో ఘనమైన కాంగ్రెస్కు కూడా ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకమైనవే! ఓటింగ్ శాతాన్ని పెంచుకోవడమే కాకుండా, గతంలో కంటే అయిదారు స్థానాలు ఎక్కువగా గెల్చుకోవాలనే పట్టులదతో ఉంది. ప్రియాంకగాంధీ అయితే కాలికి బలపం కట్టుకుని మరీ ప్రచారంలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ కూడా శ్రమించారు. వీరి ప్రచారానికి కూడా జనం బాగా వచ్చారు. ఈసారి ఎలాగైనా సరే అధికారం సాధించాలనే పంతంతో ఉన్న ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఎన్నికల ముందునుంచే పకడ్బందీ వ్యూహాలను రచించుకున్నారు. ఉత్తరప్రదేశ్లో కుల రాజకీయాలు ఒకింత ఎక్కువే కాబట్టి వివిధ సామాజికవర్గాల ఆధారిత రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు.
సుహల్దేవ్ రాజ్భర్కు చెందిన సుహల్దేవ్ భారతీయ సమాజ్పార్టీ, మహాన్దళ్, జనతా పార్టీ సెక్యులర్ వంటి చిన్న చిన్న పార్టీతో అఖిలేశ్ పొత్తు పెట్టుకున్నారు. చిన్న పార్టీలే కాని ప్రధాన పార్టీల గెలుపోటములను శాసించగలవు. అందుకే అఖిలేశ్ వ్యూహాత్మకంగా పోత్తు పెట్టుకున్నారు. బీజేపీకి మద్దతు ఇస్తున్న యాదవేతర కులాల ఐక్యతను దెబ్బ తీస్తే తమ కూటమి విజయం సులువు అవుతుందన్నది ఆయన ఆలోచన. 2017లో జరిగిన ఎన్నికల్లో యాదవేతర అల్ప సంఖ్యాల కులాల్లో బీజేపీ 61 శాతం ఓట్లను సంపాదించగలిగింది. అలాగని వీరు ప్రతీసారి బీజేపీకే ఓటేస్తారన్న గ్యారంటీ ఏమీ లేదు. ఓబీసీలలో ఉన్న 76 ఉప కులాలలో ప్రతి కులానికి ఒక్కో ఆకాంక్ష ఉంది.
ఒక్కో డిమాండ్ ఉంది. వారి ఆకాంక్షలను, డిమాండ్లను నెరవేరుస్తామన్న హామీలను ఇచ్చే పార్టీకే జై కొడతారు. ఇప్పుడు వీరంతా ఫలానా పార్టీకి గంపగుత్తగా ఓట్లు వేస్తారని చెప్పడానికి లేదు. బీజేపీ ఆందోళన కూడా ఇదే! ఓబీసీ ఓట్లను ఎన్నో కొన్ని తీసుకురాగల సమర్థులు స్వామి ప్రసాద్ మౌర్య ఇప్పుడు బీజేపీ నుంచి బయటకు వచ్చేసి ఎస్పీతో చేరారు. ఇంతకు ముందు అప్నాదళ్ (ఎస్) ఉండింది.. ఇప్పుడా పార్టీ ఇంటిపోరుతో సతమతమవుతోంది. యోగి ఆదిత్యనాథ్ను అధికారంలోంచి దింపాలనే కసి ప్రజలలో కనిపిస్తున్నదని అప్నాదళ్ (కె) నేత పల్లవి పటేల్ అంటున్నారు. ఈ అంశాలు బీజేపీని బాగా కలవరపెడుతున్నాయి. జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి నిషాద్ పార్టీతో పొత్తుపెట్టుకుంది బీజేపీ. ఇది ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి.
సొమవారం ఆఖరిదశ పోలింగ్ జరిగే జిల్లాలలో దళిత ఓట్లతో పాటు కుర్మీల, పటేళ్ల, బనియాల, రాజ్భర్ల, నిషాద్ల, మౌర్యాల, బ్రాహ్మణుల, ఠాకూర్ల ఓట్లు అత్యంత కీలకం కానున్నాయి. ఈ తొమ్మిది జిల్లాలలో మైనారిటీలు 12 శాతం ఉంటే, దళితులు 24 శాతం మంది ఉన్నారు. 2017లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అసెంబ్లీ స్థానాలను గెల్చుకుంది. ఎస్పీ 11 స్థానాలను గెల్చుకుంటే, బహుజన్ సమాజ్పార్టీ ఆరు నియోజకవర్గాలలో గెలిచింది. మొదటి రెండు దశల పోలింగ్ వరకు అభివృద్ధి నినాదాన్ని ఎత్తుకున్న బీజేపీ ఆ తర్వాత నుంచి హిందుత్వ అంశాన్ని మళ్లీ తెరమీదకు తెచ్చింది. పాత సంఘటనలను తిరిగి తోడుతోంది.
ఇక ఇప్పుడు ఉక్రెయిన్ నుంచి విద్యార్థుల తరలింపును ప్రచారాస్త్రంగా వినియోగించుకుంది. అలాగే కాశీ కారిడార్ పనులు తమ వల్లే సాధ్యమయ్యిందని చెప్పుకుంటోంది. మోదీ, యోగి అనే డబుల్ ఇంజన్ వల్లే రాష్ట్రం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్నదంటూ ఓటర్లకు విన్నవించుకుంటోంది. ఓబీసీకి చెందిన మోదీని బీజేపీ ప్రధాని పీఠంలో కూర్చొబెట్టిందని, ఓబీసీలకు బీజేపీ ఎంత ప్రాధాన్యమిస్తుందో చెప్పడానికి ఇదొక్క ఉదాహరణ చాలని చెబుతోంది. అఖిలేశ్ కూడా ఓబీసీ ఓట్ల కోసం అనేక హామీలను ఇచ్చారు. కులాలవారీ జనగణనను బీజేపీ ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నదని, ఓబీసీపై బీజేపీకి ఉన్నది కపట ప్రేమేనని ఎస్పీ ప్రచారం చేస్తోంది. రిజర్వేషన్లను తొలగించడానికి బీజేపీ కుట్ర చేస్తున్నదని అంటోంది.
బీజేపీ టికెట్ ఆశించి భంగపడిన వారిలో చాలా మంది తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారంతా పార్టీకి వ్యతిరేకంగా పని చేయవచ్చనే భయం బీజేపీలో ఉంది. ఇక మీర్జాపూర్ జిల్లాలో అయితే బీజేపీతో పోలిస్తే సమాజ్వాదీ పార్టీ రవ్వంత ముందంజలో ఉంది. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యేలపై ప్రజలలో ఆగ్రహం, వ్యతిరేకత ఉన్నాయి. వింధ్ ప్రాజెక్టు పేరుతో 930 ఇళ్లను కూల్చివేయడంతో ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. రోడ్ల విస్తరణంలో తన సొంత కులమైన ఠాకూర్ల ఇళ్లను అలాగే వదిలేసి బ్రాహ్మణులు, వైశ్యులకు చెందిన ఇళ్లను కూల్చివేశారని స్థానికులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి: Chicken Price: బాబోయ్.. ఈ చికెన్ చిక్కనంటోంది.. కోడి ధర తగ్గనంటోంది.. కారణం ఇదే!