Manikonda Incident: మణికొండలో గల్లంతైన వ్యక్తి.. నెక్నాంపూర్ చెరువులో లభ్యమైన మృతదేహం

|

Sep 27, 2021 | 3:48 PM

హైదరాబాద్‎లోని మణికొండలో నాలాలో పడి గల్లంతైన రజినీకాంత్‌ మృతదేహం లభ్యమైంది.

Manikonda Incident: మణికొండలో గల్లంతైన వ్యక్తి.. నెక్నాంపూర్ చెరువులో లభ్యమైన మృతదేహం
Gallanth
Follow us on

హైదరాబాద్‎లోని మణికొండలో నాలాలో పడి గల్లంతైన రజినీకాంత్‌ మృతదేహం లభ్యమైంది. డ్రైనేజీ కలిసే నెక్నాంపూర్‌ చెరువులో అతని మృతదేహం కనిపించింది. గోపిశెట్టి రజినీకాంత్‌ షాద్​నగర్‎​లో సాఫ్ట్‎​వేర్ ఇంజినీర్‎​గా పనిచేస్తున్నారు. గత శనివారం మణికొండ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఆ ప్రాంతంలో నాలా వర్క్‌ చేసిన జీహెచ్‎ఎంసీ సిబ్బంది.. చిన్న సైన్‌ బోర్డులు తప్ప ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేయలేదు. అయితే భారీ వర్షానికి ఆ సైన్‌ బోర్డులు కొట్టుకుపోయాయి. రజినీకాంత్‌ మణికొండ గోల్డెన్‌ టెంపుల్‌ ముందు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నీటిలో ఆ గుంత కనిపించక అందులో పడిపోయాడు.

అప్పటి నుంచి అతని కోసం రెండు DRF బృందాలు గాలిస్తున్నాయి. తూములు వెళ్లి నాళా కలిసే ప్రాంతంలో ఒక బృందం గాలించగా… మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న నెక్నాంపూర్ చెరువు వద్ద మరో బృందం గాలింపు చర్యలు జరిపింది. చివరకు నెక్నాంపూర్ చెరువులో గుర్రుపు డెక్కాను తొలగిస్తుండగా రజినీకాంత్ మృతదేహం కనిపించింది. దీంతో మూడు రోజుల గాలింపు నిరీక్షణకు తెరపడింది. రజినీకాంత్ మృతి చెందడంతో అతని కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు చెబుతున్నారు. ఎలాంటి సైన్‌ బోర్డులు ఏర్పాటు చేయలేదన్నారు. 3 నెలల నుంచి వర్క్‌ జరుగుతోందని తెలిపారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినా.. అధికారులు ఖచ్చితమైన చర్యలు తీసుకోలేదని చెప్పారు.

రజినీకాంత్ కుటుంబ సభ్యులను మంత్రి సబిత ఇంద్రారెడ్డి పరామర్శించారు. ఈ ఘటన చాలా బాధాకరమన్నారు. ఘటనాస్థలిని పరిశీలించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి… నిర్మాణాల వద్ద జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని.. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

 

ఇదీ చదవండి: Zojila tunnel: మేఘా ఆధ్వర్యంలో అత్యద్భుతంగా జోజిలా టన్నెల్‌ నిర్మాణం.. రేపు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సందర్శన..