రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 11మంది మృతి, 8మందికి తీవ్రగాయాలు.. దైవ దర్శనం చేసుకుని వస్తుండగా కబళించిన మృత్యువు

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున ప్రమాదంలో 11మంది ప్రాణాలను కోల్పోయారు.

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 11మంది మృతి, 8మందికి తీవ్రగాయాలు.. దైవ దర్శనం చేసుకుని వస్తుండగా కబళించిన మృత్యువు
Rajasthan Road Accident

Updated on: Aug 31, 2021 | 11:43 AM

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున ప్రమాదంలో 11మంది ప్రాణాలను కోల్పోయారు. బికనేర్- జోధ్‌పూర్ జాతీయ రహదారిపై ఎదురెదురుగా వచ్చిన కారు- ట్రక్కు బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో 11 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. నగౌర్‌లోని శ్రీ బాలాజీ పట్టణం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించగా.. మరో ముగ్గురిని ఆసుపత్రిలో తరలిస్తుండగా, మార్గమధ్యలో మృత్యువాతపడ్డారు. గాయపడ్డవారిని బికనీర్‌లోని నోఖా ఆస్పత్రికి తరలించినట్టు శ్రీబాలజీ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ వెల్లడించారు. క్షతగాత్రుల్లో కూడా ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని ప్రాంతానికి చెందిన కుటుంబసభ్యులు బంధులతో కలిసి రాజస్థాన్‌‌లోని రామ్‌దేవరా, కర్నీ మాత ఆలయాలను దర్శించుకుని తిరుగు వస్తుండగా దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. కాగా, జిల్లా ఉన్నతాధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ‘మధ్యప్రదేశ్‌కు తిరుగు ప్రయాణమైన 11 మంది యాత్రికులు నగౌర్‌లోని శ్రీబాలాజీ పట్టణం వద్ద జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరం.. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఈ కష్టకాలంలో భగవంతుడు వారికి ధైర్యాన్నివ్వాలి.. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్ధిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.


రాజస్థాన్‌లో రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినందుకు సంతాపం వ్యక్తం చేశారు. “రాజస్థాన్‌లోని నాగౌర్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చాలా బాధాకరం. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారందరి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.


Read Also…  Chinese Apps: భారత్‌లో గుట్టుచప్పుడు కాకుండా విస్తరిస్తున్న చైనా యాప్స్‌.. మూలాలు తెలియకుండా జాగ్రత్త..!

Loading...
Unable to load recommendations.
Follow Us