Crime News: అయ్యో ఎంతపని చేశావమ్మా..? ఆడపిల్ల పుడుతుందేమోనని..

|

Jan 07, 2022 | 12:30 PM

Mancherial District: తెల్లవారితే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వాల్సిన ఓ తల్లి.. అర్థాంతరంగా తన ప్రాణాలు తీసుకుంది‌. మళ్లీ ఆడపిల్ల పుడుతుందేమో అన్న

Crime News: అయ్యో ఎంతపని చేశావమ్మా..? ఆడపిల్ల పుడుతుందేమోనని..
Suicide
Follow us on

Mancherial District: తెల్లవారితే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వాల్సిన ఓ తల్లి.. అర్థాంతరంగా తన ప్రాణాలు తీసుకుంది‌. మళ్లీ ఆడపిల్ల పుడుతుందేమో అన్న భయంతో నిండు గర్బవతి కడుపులో ఉన్న బిడ్డతో సహా ఊపిరి వదిలింది. మూడేళ్ల చిన్నారిని తల్లి లేని బిడ్డను చేసి తనువు చాలించింది. ఈ విషాద సంఘటన మంచిర్యాల జిల్లా ఎన్టీఆర్ నగర్లో చోటు చేసుకుంది. పోస్ట్ మార్టం అనంతరం అసలు విషయం తెలియడంతో కన్నీళ్లు ఆగడం లేదు. ఆడపిల్ల పుడుతుందని ఆత్మహత్య చేసుకున్న ఆ తల్లి కడుపులో మగ శిశువు ఉన్నట్టుగా వైద్యులు తెలపడంతో.. అయ్యో తల్లి ఎంత పని చేసావంటూ బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలం నర్సాపూర్‌కు చెందిన పులిశెట్టి గంగన్న-శ్యామల రెండో కూతురు రమ్య (26) ను ఇదే జిల్లా ఎన్టీఆర్ నగర్‌కు చెందిన ఎగ్గెన ఆనంద్‌కు ఇచ్చి 2017 లో పెళ్లి చేశారు. వారికి రెండేళ్ల క్రితం ఆరాధ్య పుట్టింది. ప్రస్తుతం రమ్య 9 నెలల గర్భిణి.. వైద్య చికిత్సలకు వెళ్లిన ప్రతిసారి అత్తింటి వారు మళ్లీ ఆడపిల్ల పుడితే ఎలా అంటూ పదే పదే ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ విషయంపై అనుమానం పెంచుకున్న రమ్య.. డెలివరీ తేదీకి ఒక్కరోజు ముందు ఆత్మహత్య చేసుకుంది. ఈనెల 6న కాన్పు ఉండడంతో మళ్లీ ఆడపిల్ల పుడితే ఇబ్బందులు తప్పవని భావించిన రమ్య బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.

రమ్య ఆత్మహత్యకు అత్తింటి తరుపు బంధువైన ఓ వైద్యుడి తప్పుడు సమాచారమే కారణమని పేర్కొంటున్నారు. అతని సమాచారంతోపాటు అత్తింటివారి వేధింపుల కారణంగా రమ్య ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది గంటల్లో శిశువుకు ప్రాణం పోయాల్సిన ఆ తల్లి.. బిడ్డతోపాటు తన నిండు ప్రాణాలను తీసుకోవడంపై అంతా కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయ్యో తల్లి ఎంత పని చేసావంటూ బంధువులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్నారు.

రమ్య ఆత్మహత్య సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. రమ్య కడుపులో నుంచి మృతి చెందిన మగ శిశువును వైద్యులు వెలికితీశారు. ఆడపిల్ల పుడుతుందనుకొని ఆత్మహత్య చేసుకున్నదని, గర్భంలో మగబిడ్డ ఉన్నదని తెలిస్తే తమకు కడుపుకోత మిగిల్చేది కాదని తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. రమ్య తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

నరేశ్, టీవీ9 తెలుగు రిపోర్టర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా

Also Read: PPF Scheme: మీరు పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారా..? అదిరిపోయే ప్రయోజనం.. రోజుకు రూ.400లతో కోటి రూపాయల బెనిఫిట్‌..!

Omicron: దేశంలో భారీగా విస్తరిస్తున్న ఒమిక్రాన్.. 3 వేలు దాటిన కేసుల సంఖ్య