కుటుంబ కలహాల కారణంగా ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలతో కలిసి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనలో తల్లి ప్రాణాలతో బయటపడగా, కూతురు, కుమారుడు చనిపోయారు. దీంతో ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఈ సంఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది.
సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం సింగిరెడ్డి పాలెం గ్రామానికి చెందిన మహిళ..ఇంట్లో గొడవలు, మనస్పర్థలతో తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో క్షణికావేశంలో తన ఇద్దరు పిల్లలను తీసుకుని సుద్దాల చెరువులో దూకింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు చెరువులోకి దూకి వారిని కాపాడే ప్రయత్నం చేశారు. తల్లి మాత్రం ప్రాణాలతో బయటపడగా, ఇద్దరు పిల్లల ఆచూకీ లభించలేదు. చివరకు చేసేది లేక పోలీసులకు సమాచారం అందజేయగా, చెరువులో గాలింపు చేపట్టిన పోలీసులు చిన్నారులిద్దరి మృతదేహాలను వెలికితీశారు. చిన్నారుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.