Crime News: వీడు మామూలోడు కాదు.. 37 కోట్ల బీమా డబ్బుల కోసం పాముతో వేరే వ్యక్తిని చంపాడు.. చివరకు

|

Oct 26, 2021 | 8:06 PM

Drama: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఓ ఎన్నారై ఓ వ్యక్తిని చంపాడు. అనంతరం అతను తనేనంటూ ఇన్యూరెన్స్ క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దాదాపు 37.7 కోట్లకు

Crime News: వీడు మామూలోడు కాదు.. 37 కోట్ల బీమా డబ్బుల కోసం పాముతో వేరే వ్యక్తిని చంపాడు.. చివరకు
Crime News
Follow us on

Insurance Drama: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఓ ఎన్నారై ఓ వ్యక్తిని చంపాడు. అనంతరం అతను తనేనంటూ ఇన్యూరెన్స్ క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దాదాపు 37.7 కోట్లకు సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బులను సులభంగా తీసుకుందామనుకొని అడ్డంగా బుక్కయ్యాడు. ఈ షాకింగ్ సంఘటన మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభాకర్ భీమాజీ వాఘ్‌చౌరే (54) అనే వ్యక్తి గత 20 ఏళ్లు అమెరికాలో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరిలో స్వదేశానికి వచ్చి, మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో రజుర్‌ అనే గ్రామంలో నివాసముంటున్నాడు. అనంతరం మూడు నెలల తర్వాత ఏప్రిల్‌ 22న రజుర్‌ పోలీస్‌ స్టేషన్‌కు అక్కడి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వాఘ్‌చౌరే అనే వ్యక్తి మరణించినట్లు రిపోర్టు వచ్చింది. దీనిపై రిపోర్టు ఇవ్వవలసిందిగా.. దరఖాస్తు అందడంతో అనంతరం పోలీసులు రంగంలోకి దిగి విచారించారు. పోలీసులు సదరు ఆసుపత్రికి వెళ్లి విచారణ చేపట్టగా.. ప్రవీణ్‌, హర్షద్‌ లహంజె అనే ఇద్దరు వ్యక్తులు మృతుడు వాఘ్‌చౌరేగా గుర్తించారు. అయితే.. ప్రవీణ్‌ అనే వ్యక్తి మృతుడికి మేనల్లుడినని చెప్పుకున్నాడు. మృతుడు ప్రభాకర్ భీమాజీ వాఘ్‌చౌరే పాముకాటుతో మరణించినట్లు వైద్యాధికారులు నిర్ధారించారు అంత్యక్రియల నిమిత్తం మృతదేహాన్ని మేనల్లుడికి అప్పగించారు. దీంతో కథ ముగిసిందిలే అనుకున్నాడు. అనంతరం భీమా డబ్బులు 37.7 కోట్ల కోసం అమెరికాలోని సంస్థకు దరఖాస్తు చేసుకున్నాడు.

దీంతో సీన్ రివర్స్ అయింది. వాఘ్‌చౌరే జీవిత బీమా క్లెయిమ్‌పై దర్యాప్తు చేస్తున్న బీమా సంస్థ అధికారులు అతని మరణ వివరాలను కోరుతూ అహ్మద్‌నగర్ అధికారులను సంప్రదించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బీమా సంస్థ అధికారులు మృతుడి వాఘ్‌చౌరే ఇంటి పక్కవారిని సమాచారం అడిగారు. అయితే.. ఇక్కడ పాముకాటు సంఘటన ఏదీ చోటుచేసుకోలేదని, అయితే.. అంబులెన్స్‌ మాత్రం ఆ ఇంటి ఆవరణలో కనిపించినట్లు సమాధానమిచ్చారు. తర్వాత వాఘ్‌చౌరే మొబైల్‌ కాల్‌ రికార్డులను పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అతను బతికి ఉండటమేకాకుండా హాస్పిటల్లో తనను తాను మేనల్లుడు ప్రవీణ్‌గా పరిచయం చేసుకున్నాడడని తేలింది. సమాచారం అందుకున్న పోలీసులు గతవారం వాఘ్‌చౌరేను, అతనికి సహకరించిన నలుగురు అనుచరులను అదుపులోకి తీసుకోని విచారించినట్లు అహ్మద్‌నగర్‌ ఎస్పీ మనోజ్‌ పటేల్‌ వెల్లడించారు.

చనిపోయిన వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన నవ్‌నాథ్‌ యశ్వంత్‌ ఆనప్‌ (50)గా గుర్తించారు. ఏప్రిల్‌ 22న ఆనప్‌ను బలవంతంగా ముందుగానే నిర్ణయించిన ప్రాంతానికి తరలించి కాలి వేలిపై పాముతో కరిపించి చంపారు. అతను మరణించాడని నిర్ధారణ అయిన తర్వాత మృతదేహాన్ని వాఘ్‌చౌరే ఇంటికి తరలించి, అంబులెన్స్‌ రప్పించారు. అనంతరం ఆసుపత్రిలో వేరే వ్యక్తులతో చనిపోయింది భీమాజీ వాఘ్‌చౌరే నంటూ చెప్పించాడు. అయితే.. అంతకుముందు కూడా ప్రభాకర్ భీమాజీ వాఘ్‌చౌరే బీమా కంపెనీని మోసం చేశాడు. గతంలో అతని భార్య బతికి ఉండగానే 2017లో ఆమె చనిపోయిందని బీమా కంపెనీ నుంచి బీమా క్లెయిమ్‌ చేశాడు. తీరా మోసపోయామని భావించిన బీమా సంస్థ అతని మృతి గురించి కూడా దర్యాప్తు మొదలు పెట్టింది. చివరకు ఒక భిక్షగాడిని బలవంతంగా చంపి.. భీమా డబ్బుల కోసం నాటాకం ఆడినట్లు పోలీసులు తేల్చారు.

Also Read:

Kannababu: ఏపీలో ఎన్నడూ లేనివిధంగా వైఎస్సార్ రైతు భరోసా, సున్నావడ్డీ, వైఎస్సార్ యంత్ర సేవా పథకాలు: మంత్రి కన్నబాబు

SA vs WI, T20 World Cup 2021: డిపెండింగ్ ఛాంపియన్లకు మరోషాక్.. 8 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం..!