Andhra Pradesh: గృహిణిలకు బంపర్ ఆఫర్.. ముత్యాలను హారాలుగా మార్చడమే పని.. సర్వం గోవిందా

గడప దాటకండి.. కడుపులో చల్ల కదలకుండా సంపాదించండి. .ఇలాంటి ముత్యల్లాంటి మాటలతో నీట్‌గా రెండు కోట్లు కొట్టేశాడు. ఇప్పుడు పత్తాలేకుండాపోయాడు. ఇంతకీ ఎవరా చీటర్‌..? ఏంటా కథ?

Andhra Pradesh: గృహిణిలకు బంపర్ ఆఫర్.. ముత్యాలను హారాలుగా మార్చడమే పని.. సర్వం గోవిందా
Representative image

Updated on: Mar 26, 2022 | 8:51 AM

East Godavari District: ఇంటి దగ్గరే ఉండండి.. సంపాదించండి.. చేయాల్సిందల్లా ముత్యాలను దండలుగా మార్చడమేనన్న బంపర్ ఆఫర్‌కి గృహిణిలు అట్రాక్ట్ అయ్యారు. ప్రకటన ఇచ్చిన కంపెనీకి క్యూ కట్టారు. కొద్దినెలల నమ్మకం కుదిరిన తర్వాత సంస్థలో పెట్టుబడి పెట్టమని ఆశజూపిందా కంపెనీ. వడ్డీ వస్తుంది కదాని గుడ్డిగా నమ్మిన మహిళలంతా ఒకర్ని చూసి మరొకరు లక్షల రూపాయలిచ్చారు. చివరకు వాళ్లందరికి కుచ్చుటోపీ పెట్టి పరారయ్యాడు నిర్వాహకుడు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిందీ చీటింగ్ ఘటన. దూడం రవి అనే వ్యక్తి ఈ మోసానికి పాల్పడ్డాడు. ఇతడిది విజయవాడ(Vijayawada). ఆరునెలల కిందట దానవాయిపేటలో పెరల్స్‌ వరల్డ్‌(Pearls World) అనే సంస్థను ప్రారంభించాడు. ఇంట్లోనే ఉంటూ సంపాదించే మార్గం అంటూ వాల్‌ పేపర్లను వాడవాడలా అంటించి ప్రచారాన్ని హోరెత్తించాడు. చాలామంది మహిళలు రవిని ఆశ్రయించారు. దీంతో వాళ్లందరికి ముత్యాలు అందించాడు. వాటిని హారాలుగా మార్చి ఇచ్చిన వాళ్లందరికి 250 రూపాయలు ఇచ్చాడు. మొదట్లో అందరికి చెప్పినట్టుగానే డబ్బు చెల్లించాడు. ఆ తర్వాత సంస్థలో పెట్టుబడి పెడితే 12శాతం వడ్డీ ఇస్తానని నమ్మబలికాడు. రవి మాయమాటలు నమ్మిన అమాయకులు రెండు కోట్ల రూపాయల వరకూ తమ కష్టార్జితాన్ని సంస్థలో పెట్టుబడులుగా పెట్టారు. పెద్ద మొత్తంలో సొమ్ము పోగవడంతో ఓ ఫైన్‌డే రవి పత్తాలేకుండాపోయాడు.

కర్ణాటకలోని బళ్లారిలో పెరల్స్ వరల్డ్ హెడ్ ఆఫీస్ యజమానిని పోలీసులు అరెస్ట్ చేయడంతో చీటింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దాదాపు వందమంది బాధితుల నుంచి రెండు లక్షల నుంచి 5లక్షల వరకు రవి వసూలు చేసినట్టు తెలుస్తోంది. బాధిత మహిళలంతా పోలీసుల్ని ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

Also Read: బెజవాడ అన్నపూర్ణ థియేటర్‌లో ఇది పరిస్థితి.. ఎక్కడ తేడా కొట్టిందంటే…?