మహారాష్ట్ర అనాథాశ్రమంలో వెలుగుచూసిన దారుణం.. విద్యార్థినిలను వివస్త్రులను చేసి డాన్స్ చేయించిన పోలీసులు

|

Mar 03, 2021 | 11:01 PM

మహిళలు, బాలికల సంరక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా ప్రయోజనం లేకుండా పోతోంది. ఆడపిల్లలకు ఎక్కడా రక్షణ లేకుండా పోతోంది. మహారాష్ట్ర అనాధాశ్రమంలో జరిగిన దారుణం సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేస్తోంది.

మహారాష్ట్ర అనాథాశ్రమంలో వెలుగుచూసిన దారుణం.. విద్యార్థినిలను వివస్త్రులను చేసి డాన్స్ చేయించిన పోలీసులు
Follow us on

Jalgaon Hostel Horror : మహిళలు, బాలికల సంరక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా ప్రయోజనం లేకుండా పోతోంది. ఆడపిల్లలకు ఎక్కడా రక్షణ లేకుండా పోతోంది. మహారాష్ట్ర అనాధాశ్రమంలో జరిగిన దారుణం సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేస్తోంది. తమకంటూ ఎవరు లేని ఈ అభాగ్యుల పట్ల జాలి, దయ చూపాల్సింది పోయి పశువుల్లా ప్రవర్తిస్తారు కొందరు అధికారులు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి మహారాష్ట్రలో చోటు చేసుకుంది. రక్షించాల్సిన ఖాకీలే కీచకులుగా మారారు. పోలీసులు మరి కొందరు వ్యక్తులతో కలిసి ప్రభుత్వ హాస్టల్‌లోని కొందరు విద్యార్థినిల చేత అసభ్య కార్యక్రమాలు చేయించారు. బుల్దానా, చిక్లి నియోజక వర్గం బీజేపీ ఎమ్మెల్యే శ్వేతా మహాలే దీని గురించి దిగువ సభలో ప్రస్తావించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

మహారాష్ట్రంలోని జల్‌గావ్‌లో ప్రభుత్వం ఆశాదీప్‌ మహిళల వసతి గృహాన్ని నిర్వహిస్తోంది. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం కొందరు పోలీసు అధికారులు, మరి కొందరితో కలిసి హాస్టల్‌కి వెళ్లారు. అక్కడున్న విద్యార్థినిలను బెదిరించి వారి బట్టలు విప్పించి.. డ్యాన్స్‌ చేయించారు. ఈ దారుణం గురించి ఓ ఎన్జీఓకు తెలియడంతో వారు ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఇదే క్రమంలో బుధవారం శ్వేతా మహాలే దీని గురించి మహారాష్ట్ర దిగువ సభలో ప్రస్తావించారు.

ఈ సందర్భంగా శ్వేతా మహాలే మాట్లాడుతూ.. ‘‘ఈ దారుణంలో పోలీసులు కూడా పాలు పంచుకున్నారని తెలిసి సిగ్గుపడుతున్నాము. ఇలాంటి పనులతో రాష్ట్రం పరువు పోతుంది. మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే వారి పట్ల రాక్షసులుగా మారుతున్నారు. ఇలాంటి బాధితులు చాలా మందే ఉంటారని భావిస్తున్నాం. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం ”అన్నారు శ్వేతా మహాలే.

దీనిపై మహారాష్ట్ర సర్కార్ స్పందించింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించామని తెలిపారు. మహాలే లేవనెత్తిన సమస్యకు సమాధానమిస్తూ దేశ్ ముఖ్ ఈ సంఘటనపై దర్యాప్తు జరిపేందుకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశామని.. వారు రెండు రోజుల్లో నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు. దారుణం జరిగిన హాస్టల్‌ను మహిళా, శిశు సంక్షేమ శాఖ నిర్వహిస్తుంది.

ఇదీ చదవండిః తమిళనాడు చిన్నమ్మ సంచలన నిర్ణయం… రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన శశికళ