ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు జవాన్లు మృతి.. 12 మంది భద్రతా సిబ్బందికి గాయాలు

|

Apr 03, 2021 | 5:41 PM

ఛత్తీస్‌గఢ్ అడవులు మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. శనివారం మధ్యాహ్నం బీజాపూర్‌ జిల్లాలో భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు జవాన్లు మృతి.. 12 మంది భద్రతా సిబ్బందికి గాయాలు
Encounter
Follow us on

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్ అడవులు మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. శనివారం మధ్యాహ్నం బీజాపూర్‌ జిల్లాలో భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలను కోల్పోయారు. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు కూడా హతమయ్యారు. మరో 12 మంది జవాన్లకు గాయాలయినట్లు డీజీపీ అవస్థి తెలిపారు.

బీజాపూర్ జిల్లాలోని తార్రెమ్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు డీజీపీ అవస్థి వెల్లడించారు. చనిపోయిన వారిలో ఇద్దరు ఛత్తీస్‌గఢ్ పోలీసులు, ఇద్దరు కోబ్రా సిబ్బంది, బస్తర్ బెటాలియన్‌కు చెందిన మరో సీఆర్‌పీఎఫ్ జవాన్ ఉన్నారని పేర్కొన్నారు. గాయపడ్డ జవాన్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని సమాచారం.

బీజాపూర్ జిల్లాలోని తార్రెమ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు నిఘా వర్గాల ద్వారా అధికారులకు సమాచారం అందించింది. ఇదే క్రమంలోనే అడవులను భద్రతా సిబ్బంది జల్లెడ పడుతున్నారు. శనివారం కూంబింగ్ నిర్వహిస్తుండగా మధ్యాహ్నం 1 గంట సమయంలో భద్రతా సిబ్బందికి మావోయిస్టులు తారసపడ్డారు. తప్పించుకునే క్రమంలో మావోయిస్టులు భద్రతా సిబ్బందిపై కాల్పులకు పాల్పడ్డారు. వెంటనే జవాన్లు కూడా కాల్పులు ప్రారంభించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు భద్రతా సిబ్బందితో పాటు ఇద్దరు మావోయిస్టులు మరణించారు. ప్రస్తుతం తార్రెమ్ అటవీ ప్రాంతం మొత్తం భద్రతా దళాలు మోహరించాయి. తప్పించుకున్న మావోయిస్టుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, మరణించిన మావోయిస్టులను గుర్తించాల్సి ఉందని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

Also Read… D-Mart: ముంబయి లో ఇల్లు కొన్న డి-మార్ట్ అధినేత రాధాకృష్ణన్ దమానీ..ఖరీదు తెలిస్తే షాక్ అవుతారు!