Cyber Crime: కిడ్నీలు అమ్మి అప్పులు కట్టాలనుకున్నారు.. వాళ్లనూ దోచేశారు సైబర్ కేటుగాళ్లు.

|

Jul 14, 2021 | 11:43 AM

అప్పులు తీర్చేందుకు కిడ్నీలు అమ్ముకోవడం తప్ప వేరే మార్గం లేదని భావించిన వారిని కూడా సైబర్ కేటుగాళ్లు ముంచేశారు.​  కిడ్నీలు...

Cyber Crime: కిడ్నీలు అమ్మి అప్పులు కట్టాలనుకున్నారు.. వాళ్లనూ దోచేశారు సైబర్ కేటుగాళ్లు.
Kidney Selling
Follow us on

అప్పులు తీర్చేందుకు కిడ్నీలు అమ్ముకోవడం తప్ప వేరే మార్గం లేదని భావించిన వారిని కూడా సైబర్ కేటుగాళ్లు ముంచేశారు.​  కిడ్నీలు కొనేవారి కోసం ఆన్‌లైన్‌లో వెతుకులాట మొదటలెట్టిన దంపతులకు సైబర్‌ మోసగాళ్లు మాయమాటలు చెప్పి రూ.40.38 లక్షల వరకు కాజేశారు. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఉండే మోది వెంకటేశ్‌, లావణ్య దంపతులు స్థానికంగా స్టేషనరీ, బ్యాంగిల్‌ స్టోర్‌ రన్ చేస్తున్నారు. రెండేళ్ల క్రితం సొంతగా ఇళ్లు కట్టుకునేందుకు పనులు ప్రారంభించారు. ఇందుకు ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ద్వారా మొదట రూ.34 లక్షలు, తర్వాత మరో రూ.10 లక్షలు లోన్ తీసుకున్నారు. నాలుగంతస్తుల ఇల్లు రెడీ అయ్యేసరికి రూ.1.50 కోట్ల అప్పులయ్యాయి. కరోనా లాక్‌డౌన్‌ పరిస్థితుల నేపథ్యంలో వ్యాపారం దాదాపు మూతపడింది. మరోవైపు అప్పులిచ్చినవారి నుంచి ఒత్తిళ్లు పెరిగాయి. తమకు అప్పులిచ్చిన వారికి ఎలాగైనా తిరిగివ్వాలని ఫిక్సయిన భార్యాభర్తలిద్దరూ కిడ్నీలు అమ్ముకోవడానికి సిద్దపడ్డారు.

గూగుల్‌లో సెర్చ్ చేసి బుక్కయ్యారు….

కిడ్నీలు కొనేవారి గురించి దంపతులు గూగుల్‌లో సెర్చ్ చేశారు. మొదట ఓ వ్యక్తి పరిచయమై.. కేవలం రిజిస్ట్రేషన్‌ ఫీజు కడితే చాలన్నాడు. ఆ తర్వాత కిడ్నీకి బీమా, కరెన్సీ ఎక్స్ఛేంజ్‌ల కోసమంటూ మొత్తం రూ.10 లక్షల వరకు వసూలు చేశాడు. అతనికి మరిన్ని డబ్బులు ఇవ్వలేక మరో వ్యక్తిని సంప్రదించారు. అతనూ రూ.12 లక్షల వరకు గుంజేశాడు. ఇలా మొత్తం నలుగురిని ఆన్‌లైన్‌లో సంప్రదించారు. ఓ వ్యక్తి కేవలం రిజిస్ట్రేషన్‌ ఫీజు కడితే రావాల్సిన మొత్తంలో సగం అకౌంట్లలో వేస్తానని నమ్మించాడు. చెప్పినట్లే రెండు ఖాతాల్లో డబ్బులు జమైనట్లు కనిపించాయి. రెండు, మూడు రోజుల్లో ఆ డబ్బులు తీసుకోవచ్చని చెప్పాడు. కానీ, విత్‌డ్రా చేద్దామంటే అవ్వట్లేదు. అతన్ని తిరిగి సంప్రదించగా.. ఆర్థికశాఖ, ఎయిర్‌ఫోర్స్‌ అథారిటీ, ఐటీ శాఖ సర్టిఫికెట్లు అవసరమంటూ డబ్బులు కట్టించుకున్నాడని బాధిత దంపతులు కంప్లైంటులో పేర్కొన్నారు.

దొంగ నోట్లు ఇచ్చి.. ముంచేశారు..

మరో వ్యక్తి డబ్బులు తీసుకునేందుకు బెంగళూరుకు వస్తే.. తమ మనుషులు అడ్వాన్స్‌ చెల్లిస్తారని చెప్పాడు. అది నిజమేనని నమ్మి వారు అక్కడికి వెళ్లారు. ఇద్దరు వ్యక్తులు హోటల్‌కు వచ్చి లాకర్‌ తెరిచి డబ్బులు చూపించారు. నోట్లు నలుపు రంగులో ఎందుకు ఉన్నాయని ప్రశ్నించగా.. ఇదంతా ఆర్‌బీఐ డబ్బు అని, రసాయనాలతో క్లీన్ చేయాల్సి ఉంటుందని నమ్మించారు. కొన్నింటిని శుభ్రం చేసి చూపించారు. వాటిని ఓ ప్యాకెట్‌లో కట్టి ఇచ్చి.. 48 గంటల వరకు తెరవకూడదన్నారు. ముంబై నుంచి రసాయనాలు తెప్పించాలంటూ వారు డబ్బులు కట్టించుకున్నారని, ఇందుకు తెలిసినవారి దగ్గర బంగారాన్ని తాకట్టు పెట్టినట్లు దంపతులు వెల్లడించారు. తీరా హైదరాబాద్‌కు వచ్చాక ప్యాకెట్‌ తెరిచిచూస్తే అవన్నీ దొంగ నోట్లని తెలిసిందని వారు వాపోయారు.

Also Read: అవధులు లేని అభిమానం.. సీఎం జగన్‌ను కలిసేందుకు తెలంగాణ యువకుడి పాదయాత్ర

కుందేలును వెంటాడి నోట పట్టిన చిరుత.. ఇంతలో ఆపద్బాంధవుడిలా వచ్చిన అడవి పంది