Araku Accident: అరకు లోయలో శుక్రవారం జరిగిన బస్సు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. 23 మంది పెద్దలు, నలుగురు పిల్లలతో కలిసి మొత్తం 27 మంది హైదరాబాద్ నుంచి విహార యాత్రకు వెళ్లారు. ఈ దుర్ఘటనలో గాయపడ్డ వారికి విశాఖలో అత్యవసర వైద్యాన్ని అందించారు. ప్రమాద ఘటన బాధితులు నగరానికి బయలుదేరారు. నలుగురి మృతదేహాలను సైతం ప్రత్యేక వాహనంలో నగరానికి తరలించారు. ప్రమాదం నుంచి బయట పడిన 16 మందిని భయాందోళన ఇంకా వెంటాడుతూనే ఉంది. దీంతో నగరంలోని షేక్పేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబాలు మాత్రం శోకసంద్రంలో మునిగిపోయాయి. ఎంతో ఆనందంగా విహారయాత్రకు వెళ్లిన వారి జీవితాలను ఊహించని ప్రమాదం మలుపుతిప్పింది.