Cheating: ఘరానా మోసగాడు.. కోర్టు స్టేలతో తప్పించుకుంటూ కోటీశ్వరుడిగా మారాడు.. చివరికి..

|

Dec 22, 2021 | 3:04 PM

మోసాలు చేయడం తెలుసు.. దొరికితే తప్పించుకోవడమూ తెలుసు.. గతంలో కానిస్టేబుల్‌గా పనిచేసిన అనుభవం ఉండటంతో చీటింగ్‌ చేయడంలో ఆరితేరిపోయాడు.

Cheating: ఘరానా మోసగాడు.. కోర్టు స్టేలతో తప్పించుకుంటూ కోటీశ్వరుడిగా మారాడు.. చివరికి..
Cheating
Follow us on

మోసాలు చేయడం తెలుసు.. దొరికితే తప్పించుకోవడమూ తెలుసు.. గతంలో కానిస్టేబుల్‌గా పనిచేసిన అనుభవం ఉండటంతో చీటింగ్‌ చేయడంలో ఆరితేరిపోయాడు. కట్‌ చేస్తే కానిస్టేబుల్‌ స్థాయి నుంచి అతి కొద్దికాలంలోనే కరోడ్‌పతిగా ఎదిగాడు. అతడే సాయి సుధాకర్‌నాయుడు.. రియల్‌ ఎస్టేట్‎లో జనాన్ని చీటింగ్‌ చేసి కోట్ల రూపాయలు వసూలు చేశాడు. భూ కబ్జాలు, డబుల్ రిజిస్ట్రేషన్లు, చెక్‌ బౌన్స్‌లు, మహిళల బ్లాక్‌ మెయిలింగ్ ఇలా సుధాకర్‌నాయుడు మోసాల చిట్టా తవ్వినకొద్దీ బయటపడుతోంది. అయితే నాలుగేళ్లుగా కోర్టుల నుంచి స్టే తెచ్చుకుని జైలు శిక్ష తప్పించుకుంటున్న రియల్‌ మోసగాడిని అరెస్ట్‌ చేశారు సైబరాబాద్‌ పోలీసులు.

సాయి సుధాకర్‌నాయుడు రియల్‌ ఎస్టేట్‌ పేరుతో కోట్ల రూపాయల చీటింగ్‌కు పాల్పడ్డాడు. మొదట ఇతరుల ప్రాపర్టీ కొనుగోలు చేస్తానని నమ్మబలికి.. తనతో పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న భూములను ఇతరులకు విక్రయించేవాడు. అంతేకాదు ఒకే ప్లాట్‌ను ఇద్దరు, ముగ్గురికి విక్రయించేవాడు. డబుల్‌ రిజిస్ట్రేషన్‌ చేస్తూ మోసాలకు పాల్పడ్డాడు. హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ, రాజమండ్రి నగరాల్లో సుధాకర్‌నాయుడుపై 40 కేసులు నమోదయ్యాయి. అయితే ఎప్పటికప్పుడు స్టే తెచ్చుకుని జైలు శిక్ష నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు సుధాకర్‌నాయుడు.

హైదరాబాద్‌ శివారులోని కొత్తూరులో మేరీ స్వర్ణభూమి రియల్‌ ఎస్టేట్‌ పేరుతో వెంచర్‌ వేసి 28 ఎకరాల్లోని ప్లాట్లను విక్రయించాడు. అయితే ఇతర వ్యక్తులకు చెందిన భూములను ఫోర్జరీ సంతకాలతో తన పేరు మీదకు మార్చుకుని ప్లాట్లను ఇతరులకు విక్రయించేవాడు సాయి సుధాకర్‌నాయుడు. అతను దాదాపు 10 కోట్ల రూపాయల వరకు చీటింగ్‌కు పాల్పడినట్టు బయటపడింది. సుధాకర్‌నాయుడు గతంలో మంగళగిరి పోలీస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేశాడు.

సాయి సుధాకర్‌నాయుడు మోసాల చిట్టా ఒక్కొక్కటిగా బయట పడుతోంది. సుధాకర్‌నాయుడుపై ఇప్పటి వరకు 28 చెక్‌బౌన్స్‌ కేసులు నమోదయ్యాయి. డబ్బులు ఇవ్వాల్సిన వారికి చెక్‌లను ఇచ్చేవాడు. అయితే చెక్‌లు బౌన్స్‌ కావడంతో చాలా మంది బాధితులు పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే గతంలో కానిస్టేబుల్‎గా పనిచేసిన అనుభవం ఉండటంతో జైలు శిక్షల నుంచి తప్పించుకునేందుకు స్టే తెచ్చుకునేవాడు. ఓ టీవీ ఛానల్‌లో షేర్లు విక్రయిస్తానని కొంత మంది దగ్గరి నుంచి 20 కోట్ల వరకు వసూలు చేసినట్టు తెలుస్తోంది.

అటు మహిళలను అసభ్య వీడియోలు తీసి బ్లాక్‌ మెయిల్‌ కూడా చేసేవాడు సాయి సుధాకర్‌నాయుడు. ఓ బాధితురాలు సైబరాబాద్‌ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ చీటర్‌ గుట్టు రట్టయింది. సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్రకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. నాలుగేళ్లుగా కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకుని తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని అరెస్ట్‌ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మరో కేసులో కూడా సాయి సుధాకర్‌నాయుడు నిందితుడిగా భావిస్తున్నారు. సాయిసుధాకర్‌నాయుడుపై 2018లో కొత్తూరులో కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. ప్లాట్ల విక్రయాలకు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయన్నారు.

Read Also.. Shocking Incident: మహిళతో పోలీసు అసభ్యకర ప్రవర్తన.. మూత్ర విసర్జన చేస్తూ ఏం చేశాడంటే..