Forward Message: ప్రాణం తీసిన ఫార్వర్డ్ మెసేజ్.. పోలీసుల వేధింపులే కారణమంటున్న భార్య

ఫార్వర్డ్‌ మెసేజ్ ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ఒక వాట్సప్‌ మెసేజ్ ను ఫార్వర్డ్‌ చేశాడనే ఆరోపణపై పోలీసులు విచారించడంతో..

Forward Message: ప్రాణం తీసిన ఫార్వర్డ్ మెసేజ్.. పోలీసుల వేధింపులే కారణమంటున్న భార్య

Updated on: May 15, 2021 | 12:40 PM

ఫార్వర్డ్‌ మెసేజ్ ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ఒక వాట్సప్‌ మెసేజ్ ను ఫార్వర్డ్‌ చేశాడనే ఆరోపణపై పోలీసులు విచారించడంతో ఆందోళనకు గురై అస్వస్థతతో కన్నుమూశారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని నారాయణపేటకు చెందిన గుత్తుల శ్రీనివాస్‌ (టైటానిక్‌) (38) శుక్రవారం మృతి చెందాడు. పోలీసుల వేధింపుల కారణంగా చనిపోయినట్లు మృతుడి భార్య వెంకటపద్మ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి కథనం ప్రకారం.. ‘ఆక్వా కంపెనీలో పనిచేసే శ్రీనివాస్‌ సెల్‌ఫోన్‌కు ‘కోళ్లకు కూడా సోకిన కరోనా మహమ్మారి’ అనే వాట్సప్‌ సందేశం వచ్చింది. దానిని ఆయన ఇతర గ్రూప్‌లకు పంపాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు శుక్రవారం శ్రీనివాస్‌కు ఫోన్‌ చేసి విచారించారు.

తనకేమీ తెలియదని ఆయన ఎంత చెప్పినా వారు వినలేదు. దాంతో శ్రీనివాస్‌ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. శరీరంపై చెమటలు పట్టి కూలిపోయాడు. చికిత్స నిమిత్తం మూడు ఆసుపత్రులకు తీసుకెళ్లినా చేర్చుకోలేదు. చివరకు అమలాపురం కిమ్స్‌లో చేర్పించాం. ఆ తర్వాత గంట వ్యవధిలోనే ఆయన చనిపోయాడు’ అని పేర్కొన్నారు. ఇది చాలా పెద్ద కేసు అవుతుందని బెదిరిస్తూ శ్రీనివాస్‌ ఫోన్‌ను తీసుకెళ్లిన స్థానిక పోలీసులు… ఆయన చనిపోయిన కొద్ది సేపటికి దానిని వెనక్కి తెచ్చి ఇచ్చేశారన్నారు. హైదరాబాద్‌లోని సైబర్‌క్రైమ్‌ సీఐ రాజేష్‌, ఎస్సై రంజిత్‌కుమార్‌ తన భర్తను మానసికంగా హింసించారని ఆమె ఆరోపించారు. శ్రీనివాస్‌కు భార్య, తొమ్మిదేళ్ల కుమారుడు, ఏడేళ్ల కుమార్తె ఉన్నారు. దీనిపై అమలాపురం పట్టణ ఇన్‌ఛార్జి ఎస్సై సత్యప్రసాద్‌ను వివరణ కోరగా ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు.

Read Also… 

 Medical Negligence: సమయానికి వైద్యం అందక నిండు గర్బిణి మృతి.. 5 ఆసుపత్రులు తిరిగిన దక్కని ప్రాణం..!

ప్రభుత్వ ఆస్పత్రిలో కొవిడ్ పేషెంట్ ఆత్మహత్య..! వార్డులో ఉరి వేసుకొని మృతి.. కారణాలు ఇలా ఉన్నాయి..?