COVID-19: మరోసారి భయపెడుతోన్న కరోనా కేసులు.. నెల రోజుల్లో ఏకంగా..

కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఈ కొత్త వేరియంట్‌ విస్తరిస్తోంది. గడిచిన నెల రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 8.5 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. వైరస్‌ కారణంగా ఇప్పటి వరకు 3 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. ఇదిలా ఉంటే కోవిడ్‌ 19 కారణంగా డిసెంబర్‌ 17వ తేదీ వరకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం...

COVID-19: మరోసారి భయపెడుతోన్న కరోనా కేసులు.. నెల రోజుల్లో ఏకంగా..
Covid 19 Cases
Follow us

|

Updated on: Dec 24, 2023 | 7:32 AM

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పట్టింది. హమ్మయ్యా అని అంతా ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మళ్లీ తన పంజా విసిరేందుకు సిద్ధమైందీ మాయదారి రోగం. తాజాగా వ్యాపిస్తున్న కొత్త వేరియంట్ భయందోళనకు గురి చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకీ పెరుగుతోన్న కేసులు కలవరపెడుతున్నాయి.

కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఈ కొత్త వేరియంట్‌ విస్తరిస్తోంది. గడిచిన నెల రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 8.5 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. వైరస్‌ కారణంగా ఇప్పటి వరకు 3 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. ఇదిలా ఉంటే కోవిడ్‌ 19 కారణంగా డిసెంబర్‌ 17వ తేదీ వరకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 77 కోట్ల మందికి కరోనా సోకగా, 70 లక్షల మంది మరణించినట్లు డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది.

ఇక ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 1,18000 మంది కోవిడ్‌19 ఆసుపత్రిలో చేరారని, 1600 కంటే ఎక్కువ కొత్త ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU) అడ్మిషన్‌లు నమోదయ్యాయని తెలిపింది. ఇక కరోనా కారణంగా ఆసుపత్రుల్లో చేరిన రోగుల సంఖ్య 23 శాతం పెరిగిందని, ఐసీయూలో చేరిన రోజుల సంఖ్య 51 శాతం పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇదిలా ఉంటే ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్‌ సబ్‌వేరియంట్‌ జేఎన్‌ 1 కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ వేరియంట్‌తో పెద్దగా ప్రమాదం లేక పోయినప్పటికీ పెరుగుతోన్న చలి నేపథ్యంలో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు పెరుగుతున్నట్లు చెబుతున్నారు.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు జేఎన్‌1, కోవిడ్‌ 19కి కారణమయ్యే వైరస్‌ అయిన SARS-CoV-2 వంటి వాటి నుంచి రక్షణ కల్పిస్తున్నాయని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. రద్దీగా ఉన్న ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని, క్రమం తప్పకుండా చేతులు శుభ్రం చేసుకోవాలని, ఏమాత్రం లక్షణాలు కనిపించినా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తుంది. కోవిడ్‌ కొత్త వేరియంట్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు చెబుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లతో ఈ కొత్త వేరియంట్‌ను ఎదుర్కోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..