
ప్రపంచాన్ని కరోనా వణికిస్తోన్న నేపథ్యంలో సామాజిక దూరం పాటించడం ఉత్తమమంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ వైపు మొత్తుకుంటూనే ఉంది. అయితే ఆ మాటలు సరిగా ఎక్కడం లేదో..? లేక క్వారంటైన్ అంటే ఎలా అర్థమైందో తెలీదు గానీ.. ఆ రాజు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా జల్సాలు చేస్తున్నాడు. ఇంతకు ఆయన ఎవరంటే.. థాయ్లాండ్ రాజు మహా వాజిరాలోంగ్కోర్న్. జర్మనీలోని అల్పైన్ రిసార్ట్ టౌన్లోని సొన్నెన్బిచ్ల్ గ్రాండ్ హోటల్ మొత్తాన్ని బుక్ చేసుకున్న ఈ రాజు.. అక్కడ 20 మంది అమ్మాయిలు, పనివాళ్లతో కలిసి లగ్జరీ క్వారంటైన్లో ఉన్నారు. ఆ హోటల్ లోకి బయటి వారికి అనుమతి లేకపోవడంతో.. అక్కడ ఏం జరుగుతుందో బయటి ప్రపంచానికి తెలీడం లేదు.
ఇదిలా ఉంటే కరోనా వైరస్ నేపథ్యంలో జర్మనీ ఆ దేశంలోని అన్ని హోటళ్లను బంద్ చేసింది. కానీ థాయ్ రాజు ఉంటోన్న హోటల్ మాత్రం తెరిచే ఉంది. దీనిపై హోటల్ యాజమాన్యం స్పందిస్తూ.. వారంతా విదేశీయులు, పైగా ఒకే దేశానికి చెందిన వారు. ఎవరూ బయట వ్యక్తులు లేరు. ఒక్కొక్కరికీ ఒక గది ఇచ్చాం. అంతా విడిగానే ఉంటున్నారు అంటూ పేర్కొనడం గమనర్హం. కాగా థాయ్లాండ్లోనూ కరోనా విజృంభిస్తోంది. ఆ దేశంలో 1600కు పైగా కరోనా బాధితులు ఉండగా.. 10 మంది మరణించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో స్వదేశంలో ఉండకపోవడంతో పాటు.. విదేశాల్లో జల్సా చేస్తోన్న రాజుపై ఆ దేశ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాచరికాన్ని అవమానించే విధంగా ఆయన ప్రవర్తిస్తున్నారంటూ వారు ఆరోపిస్తున్నారు.
Read This Story Also: ఎన్టీఆర్ పాట పేరడీతో ‘కరోనా’పై కీరవాణి పాట.. విన్నారా..!