Telangana coronavirus: తెలంగాణలో కరోనా మహమ్మారి కరాళనృత్యం మరోసారి మొదలైంది. గడిచిన 24 గంటల్లో 495 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది. వైరస్ ప్రభావంతో మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. అయితే, నిన్న ఒక్కరోజులో 247 మంది కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు చేరారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 4,241 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 1,870 బాధితులు హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా 142 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. తాజా కేసులో తెలంగాణలో మొత్తం నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 3,05,804కు చేరుకుంది. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా మహమ్మారి ధాటికి తట్టుకోలేక మృతి చెందిన వారి సంఖ్య 1,685కు చేరింది. ఇదిలావుంటే, నిన్న ఒకే రోజు 58,029 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారులు వెల్లడించారు.