Cow Dung Smoke for Coronavirus: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. మాయదారి రోగం బారి నుంచి ఎప్పుడు బయటపడుతామా అని అందరూ ఎదురుచేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఏ చిన్న మందు వచ్చిన జనంలో ఆశలు చిగురిస్తున్నాయి. ఏపీకి చెందిన ఆనందయ్య కరోనాకు నాటు మందు తయారు చేసిన విషయం తెలిసిందే. తాజాగా కరోనా అంతంకు తెలంగాణ వాసి కూడా సరికొత్త ప్రయోగం చేశాడు. గాలిలో ప్రాణవాయువు పెంచేందుకు గోమాత పేడతో పొగ తయారు చేశాడు. ఆవు పేడ పిడకలను కాల్చే కార్యక్రమానికి మంథనిలో శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు.
పెద్దపల్లి జిల్లా మంథని ప్రాంతానికి చెందిన గోశాల నిర్వహకుడు రమేష్ సరికొత్త మందు కనిపెట్టాడు. ఆవు పేడ పొగతో కరోనా వైరస్ ను అంతం చేయడంతో పాటు ప్రాణవాయువును పెంచుకోవచ్చంటున్నారు. ప్రయోగాత్మకంగా మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు క్యాంపు కార్యాలయం వద్ద పొగ పెట్టె కార్యక్రమాన్ని శ్రీధర్ బాబు ప్రారంభించారు.
అడవిలో తిరిగే ఆవుల నుంచి సేకరించిన పేడ పిడకలను నెయ్యి, పసుపు, ఆవాలు, కర్పూరం వేసి కాల్చడం ద్వారా వచ్చే పొగతో వైరస్ అంతం కావడంతో పాటు గాలిలో మంచి ప్రాణవాయువు పెరుగుతుందని తెలిపారు. ప్రతి రోజు రెండు గంటల పాటు ఇలా పొగ పెడితే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. ప్రతి ఇంట్లో ఇలా చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. వింత ప్రయోగం బాగుందని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గోశాల నిర్వాహకులను అభినందించారు.