వలస కూలీల పాలిటి దేవుడిగా మారిన రియల్ హీరో సోనూసూద్.. మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. కూలీలను వారి స్వగ్రామాలకు చేర్చేందుకు సోనూ గత కొన్ని రోజులుగా అలిసిపోకుండా సహాయాన్ని అందిస్తూనే ఉన్నారు. ప్రతిఒక్కరికీ సాయం చేయాలనే ఉద్దేశంతో ఇటీవల ఓ టోల్ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేశారు. ఏదైనా హెల్ప్ కావాలనుకునేవారు ఫోన్ చేస్తే చాలు వెంటనే స్పందిస్తున్నారు. తాజాగా వలస కూలీల కోసం మూడు ట్రైన్లను కూడా బుక్ చేశారు సోనూసూద్.
సోనూసూద్ ఏమన్నారంటే… మొదటిసారి బస్సులను ఏర్పాటు చేసి కొంతమంది కూలీలను ముంబై నుంచి కర్ణాటకకు పంపించిన రోజు నుంచి ఇప్పటి వరకు ఫోన్ కాల్స్ ఎక్కువయ్యాయని అన్నారు సోనూసూద్. గ్యాప్ లేకుండా కాల్స్ వస్తుండటంతో కొన్నిసార్లు కొందరు చేసిన కాల్స్, మెస్సేజ్లను మిస్సయ్యానన్నారు. అందుకోసమే ఇటీవల ఓ టోల్ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేసినట్లుగా చెప్పుకొచ్చారు. బస్సుల్లో వలస కార్మికులను పంపించే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతులు రావటం కొంత ఆలస్యం అవుతున్నదని… అందుకే మూడు రైళ్లను బుక్ చేసినట్లుగా తెలిపారు. అయితే ఈ మహత్తర కార్యంలో తనకు సహకరిస్తున్నవారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సోనూసూద్.