కరోనా వైరస్ నియంత్రలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా మూడు వారాలపాటు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలు రోడ్లమీదకు రాకుండా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలకు కావాల్సిన అన్ని రకాల నిత్యవసరాలను కూడా అందుబాటులో ఉండేలా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో నిబంధనలు పట్టించుకోని కొందరు రోడ్లపైకి వచ్చేస్తున్నారు. చిన్న చిన్న కారణాలు చెబుతున్న అటువంటి వారందరికి పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. అయినప్పటికీ కొందరు మాట వినకపోవటంతో పలుచోట్ల లాఠీలకు పనిచెప్పాల్సి వస్తోంది.
లాక్డౌన్ నేపథ్యంలో జమ్ము కశ్మీర్లో పోలీసులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.
నిబంధనలను ఉల్లంఘించి.. ఏ కారణం లేకుండా రహదారులపైకి వచ్చిన కొందరు వ్యక్తులపై జమ్ము కశ్మీర్లోని రణ్బీర్ సింగ్ పురా పోలీసులు వినూత్న చర్యలు చేపట్టారు. వారి చేతులు, నుదుటిపై తుడుచుకోవడానికి సాధ్యం కాని ఇంకుతో స్టాంపు వేశారు. దీనిపై కరోనా లాక్డౌన్ అతిక్రమణదారు అనే మాటలతో పాటు… సంబంధిత పోలీస్స్టేషన్ పేరు కూడా ఉంటుంది. కాగా ఈ స్టాంపు కనీసం 15 రోజులు నిలిచి ఉంటుందని పోలీసులు వివరించారు. దీంతో వారు మళ్లీ రోడ్డు పైకి నిర్లక్ష్యంగా రాకుండా ఉంటారు. అలా కాకుండా వారు మళ్లీ రోడ్డుపైకి వస్తే గుర్తించటం కూడా సులభమవుతుందని చెప్పారు.