తెలంగాణలో తొలి సెకండరీ కాంటాక్ట్ కేసు..!

కోవిడ్ ర‌క్క‌సి కోర‌లు చాస్తోంది. కేసులు కాస్తా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి, బాధితులు డిశార్జి అవుతున్నారు అనుకునేలోపుగానే కొత్త రెండింత‌ల కొత్త కేసులు న‌మోదుకావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. తాజాగా,

తెలంగాణలో తొలి సెకండరీ కాంటాక్ట్ కేసు..!
Follow us

|

Updated on: Apr 16, 2020 | 3:33 PM

తెలంగాణ‌లో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతోంది. చాప‌కింద  నీరులా విస్త‌రిస్తున్న కోవిడ్ ర‌క్క‌సి కోర‌లు చాస్తోంది. కేసులు కాస్తా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి, బాధితులు డిశార్జి అవుతున్నారు అనుకునేలోపుగానే కొత్త రెండింత‌ల కొత్త కేసులు న‌మోదుకావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. తాజాగా,  నిజామాబాద్‌లో ఓ వ్యక్తికి సెకండరీ కాంటాక్ట్ ద్వారా వైరస్ సోకగా.. దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి క్వారంటైన్ పూర్తి చేసుకున్న చాలా రోజులకు కరోనా లక్షణాలు బయటపడ్డాయి.

నిజామాబాద్ పట్టణం ఎల్లమ్మగుట్ట ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి మంగళవారం కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది. అతడిని వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించిన అధికారులు.. వైరస్‌ ఎలా సోకిందనే అంశంపై విచారణ చేపట్టారు. బాధితుడి కుటుంబంలో ఎవరికీ కరోనా పాజిటివ్‌ లేకపోవడంతో వైరస్ ఎలా వ్యాపించిందనేది ప్రశ్నార్థకంగా మారింది. అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేయగా.. అతడికి కరోనా సోకిన వ్యక్తి ద్వారా (ప్రైమరీ కాంటాక్ట్) వైరస్ సంక్రమించిన వ్యక్తి నుంచి (సెకండరీ కాంటాక్ట్) వైరస్ వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. ఎల్లమ్మగుట్టకు చెందిన ఓ వ్యక్తి ఇటీవల ఢిల్లీ నిజాముద్దీన్‌లోని మర్కజ్‌ భవన్‌లో మత ప్రార్థనలకు హాజరై వచ్చాడు. అతడికి కరోనా పాజిటివ్‌‌గా తేలింది. అతడి నుంచి స్థానికంగా ఉంటున్న మరో వ్యక్తికి వైరస్‌ సోకింది. అతడి ద్వారా తాజాగా మూడో వ్యక్తి (సెకండరీ కాంటాక్ట్‌)కి కరోనా సోకినట్లు తేలింది.

అటు, మానిక్‌భండార్‌కు చెందిన మరో కేసు మరింత ఆందోళన క‌లిగిస్తోంది.  ఈ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి 28 రోజుల కిందట దుబాయి నుంచి వచ్చాడు. విదేశాల నుంచి రావడంతో అధికారులు అతడిని నేరుగా మాక్లూర్‌లోని క్యారంటైన్‌ కేంద్రానికి తరలించారు. అక్కడ 23 రోజుల పాటు ఉన్నా ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించలేదు. ఇటీవల అతడు స్వల్ప అస్వస్థతకు గురవగా.. పరీక్షలు నిర్వహించారు. మంగళవారం అతడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దుబాయి నుంచి వ్యక్తిలో ఇంత ఆలస్యంగా వైరస్‌ వెలుగు చూడటం అధికారులను ఆలోచనలో పడేసింది. ఇప్పటికే క్వారంటైన్ పూర్తి చేసుకున్న వారిపై మరోసారి దృష్టి పెట్టాలని ఈ ఘటన స్పష్టం చేస్తోంది. అయితే.. క్వారంటైన్ కేంద్రాల నుంచి పంపించిన వారిని మరో 14 రోజుల పాటు ఇళ్లలోనే ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.