మహారాష్ట్రలో కరోనా భూతం విలయ తాండవం చేస్తోంది. ప్రధానంగా ముంబైలో శరవేగంగా వైరస్ వ్యాప్తి చెందు తోంది. కోవిడ్ అనుమానితులకు, బాధితులకు చికిత్స అందిస్తున్న సమయంలో ఆస్పత్రి సిబ్బంది కరోనా కాటుకు గురవుతున్నారు. ఫలితంగా ముంబైలోని కొన్ని వైద్యశాలలను మూసి వేయిస్తున్నారు. కేవలం ముంబైలోనే సుమారు 100 మందికిపైగా వైద్య సిబ్బందికి కరోనా సోకింది.
వైద్య సిబ్బందిని వెంటాడుతున్న కరోనాః
దేశంలో ఇంతపెద్ద సంఖ్యలో వైద్య సిబ్బందికి కరోనా వైరస్ సోకటం ఆందోళన కలిగిస్తోంది. వైరస్ బారినపడుతున్న వారిలో ఆరోగ్య కార్యకర్తలు ముందు వరుసలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తమకు వెంటనే సెఫ్టీ కిట్స్, అదనపు భద్రతా సామాగ్రి, ట్రాన్స్పోర్టు, ఆర్థిక సాయం అందించాలని ప్రైవేటు ఆస్పత్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. బుధవారం నుంచి వైరస్ అధిక ప్రభావిత ప్రాంతంగా ప్రకటించిన ప్రాంతం లోని… భాటియా ఆస్పత్రిలో 14 మంది సిబ్బంది వైరస్ బారినపడ్డారు. వీరిలో 10 మంది నర్సులు, ఇద్దరు డాక్టర్లు, ఫిజయోథెరపిస్ట్ కి పాజిటివ్ వచ్చింది. దీంతో ఆస్పత్రికి సీల్ వేసింది ప్రభుత్వం. దాదార్లోని సుశ్రుత ఆస్పత్రిలో పని చేసే ఇద్దరు నర్సులకు పాజిటివ్ వచ్చింది. దీంతో ఇన్పెషంట్లుగా ఉన్న వారందరినీ.. 48 గంటల్లో అక్కడి నుంచి తరలించారు.
మూతపడ్డ ఆస్పత్రులుః
ముంబైలోనిపెద్ద ఆస్పత్రులు జాస్లోక్, వోక్హార్డ్, భాటియా వంటివి మూతపడ్డాయి. వీటిలో సుమారు 800-900 పడకలు ఇప్పుడు అందుబాటులో లేకుండా పోయాయి. ఆస్పత్రుల్లోనే పాజి టివ్ కేసుల నమోదు.. రోగుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. మరోవైపు, బ్రీచ్ క్యాండీలో మరో ఇద్దరు నర్సులకు పాజిటివ్ వచ్చింది. దీనికి ముందే.. ఐసీయూలో పని చేస్తున్న 180 మంది సిబ్బందిని క్వారంటైన్కు తరలించారు. కోవిడ్ వార్డుల్లో పని చేసే సిబ్బందికి పీపీఈ కిట్లు ఇవ్వకపోవడంతోనే వైరస్ సోకుతోందని దక్షిణ ముంబైలోని ఓ ఆస్పత్రిలో పని చేసే నర్సు చెప్పుకొచ్చింది.
సిబ్బంది ఆందోళనః
సుశ్రుత ఆస్పత్రిలో 27, 42 ఏళ్ల ఇద్దరు నర్సులకు పాజిటివ్ రావడంతో మిగిలిన 28 మందిని క్వారంటైన్కు తరలించారు.రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్లే కేసులు నమోదవు తున్నాయని స్థానిక అధికారి ఒకరు తెలిపారు. కస్తూర్బా ఆస్పత్రిలో ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు కాలేదని, దీనికి కారణం కఠిన ఆంక్షలు, చర్యలే అని వివరించారు. పీపీఈ కిట్ల కొరత కారణంగానే పాజిటివ్ రోగుల నుంచి సిబ్బందికి వైరస్ సోకినట్టు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.