అమెరికాలో ముఖ్యంగా న్యూయార్క్ సిటీని కరోనా హడలెత్తిస్తోంది. ఈ స్టేట్ ని అధ్యక్షుడు ట్రంప్ మేజర్ డిజాస్టర్ గా ప్రకటించారు. ఇలా ప్రకటించినందువల్ల దీనికి అదనంగా 42 బిలియన్ డాలర్ల డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ లభించనుంది. ఈ స్టేట్ ని ట్రంప్ ప్రభుత్వం మొదటిసారిగా ఇలా ప్రకటించడం విశేషం. కోవిడ్-19 తన విశ్వరూపం చూపడంతో.. ఈ సిటీలోని ఆసుపత్రుల్లో వెంటిలేటర్లు, మాస్కుల కొరత విపరీతంగా ఏర్పడింది. శుక్రవారం ఒక్కరోజే ఉదయం 10- సాయంత్రం 6 గంటల మధ్య 14 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితి విషమించడంతో ఇక యుఎస్ ఆర్మీ కొర్ఫ్స్ ఆఫ్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన సైనికులు హోటళ్లు, స్పోర్ట్స్ స్టేడియాలు, కాలేజీ ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుని వాటిని తాత్కాలిక ఆసుపత్రులుగా మార్చనున్నారు. అటు-కరోనా టెస్టింగ్ కేంద్రాల వద్ద వందలాది ప్రజలు టెస్ట్ కోసం బారులు తీరుతున్నారు.