కోవిడ్-19: ఇప్పుడు ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. కంటికి కనిపించని శత్రువుగా మారి అన్ని దేశాలను హడలెత్తిస్తోంది. కరోనా మహమ్మారి ఏ రూపంలో దాడి చేస్తుందో తెలియక పిట్టల్లా ప్రాణాలు పోతున్నాయి. కరోనా సోకిన వారు ఉండే ప్రదేశంలోని గాలిలో ఆ వైరస్ కణాలు ఉంటాయని, అందువల్ల గాలి ద్వారా కూడా కరోనా వ్యాప్తి చెందుతుందనే విషయాన్నిఇప్పటికే పలువురు సైంటిస్టులు వెల్లడించారు. కాగా, గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ధృవీకరించిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడిదే విషయంపై సీఎస్ఐఆర్ చీఫ్ శేఖర్ సి మండే కీలక వివరాలను వెల్లడించారు.
గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి పట్ల భారత్లోని అత్యున్నత ఆర్ అండ్ డీ సంస్థ సీఎస్ఐఆర్ చీఫ్ శేఖర్ సి మండే కీలక వివరాలను వెల్లడించారు. బయటకు వెళ్లినప్పుడు మాత్రమే కాకుండా.. ఆఫీసుల్లాంటి ప్రాంతాల్లోనూ మాస్కులు ధరించాలని సూచించారు. జనం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లోకి వెళ్లొద్దని చెప్పారు. పని ప్రదేశాల్లో గాలి వెలుతురు సరిపడా వచ్చేలా చూసుకోవాలని సీఎస్ఐఆర్ చీఫ్ సూచించారు.
కరోనా సోకిన వారు దగ్గినా, తుమ్మినప్పుడు పడే తుంపర్లు గాల్లో ఉంటాయని చెబుతున్నారు. పెద్ద తుంపర్లు ఉపరితలాలపై పడతాయని, కానీ చిన్న తుంపర్లు మాత్రం గాల్లో ఎక్కువ సేపు అలాగే ఉంటాయని అన్నారు. అందువల్ల ఆ గాలిని పీలిస్తే కరోనా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. అందుకు మాస్క్ ఒక్కటే ఆయుధంగా చెబుతున్నారు. మాస్కు ధరిస్తే కరోనా సోకే అవకాశాలు 80 శాతం తగ్గిపోతాయని అంటున్నారు. అందువల్ల కరోనాను కట్టడి చేయాలంటే.. మాస్కు తప్పనిసరిగా వేసుకోవాలని చెబుతున్నారు.