
కరోనా మహమ్మారి.. కంటికి కనిపించని ఓ మాయదారి వైరస్ యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయేలా చేసింది. పర్యాటకం మొదలు ఐటీ వరకు అన్ని రంగాలపై తీవ్ర దుష్ఫ్రభావాన్ని చూపింది. వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
అడుగు బయట పెట్టాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. దీంతో ప్రభుత్వాలు లాక్డౌన్లు విధించాయి. నెలలపాటు ప్రపచమంతా స్థంభించింది. అన్ని పనులు ఆగిపోయాయి. దీంతో సంస్థలు అనివార్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అవలంభించాల్సి వచ్చింది. అప్పటి వరకు ఇంటి నుంచి పని చేసే విధానాన్ని అవలంభించని సంస్థలు సైతం ఈ విధానాన్ని అమలు చేయక తప్పలేదు. దీంతో అటు కంపెనీల పని పూర్తికావడంతో పాటు ఇటు ఉద్యోగులకు కూడా కలిసొచ్చింది.
ఎంచక్కా ఇంటి నుంచి పనిచేసుకునే అవకాశం లభించింది. పట్టణాల్లో ఏసీ గదుల్లో పనిచేసే వారు ఊర్లలో పొలాల మధ్య పనిచేసుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం కరోనా ప్రభావం పూర్తిగా తొలగిపోయింది. పనులన్నీ యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి స్వస్తి పలికాయి. అయితే కొందరు ఉద్యోగులు మాత్రం ఇప్పటికే ఇదే విధానానికి అలవాటు పడి ఆఫీసులకు రావడానికి ఆసక్తి చూపించడం లేదు. దీంతో కంపెనీలు సీరియస్ అవుతున్నాయి.
ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లో ఆఫీసులకు రావాల్సిందేనని అల్టిమేటం జారీ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే పలు కంపెనీలు ఉద్యోగులకు సూచించగా తాజాగా మరో టెక్ దిగ్గజం ఈ మేరకు ఉద్యోగులకు మెయిల్స్ పంపించాయి. విప్రో తమ ఉద్యోగులను ఆఫీసుకు రావాల్సిందేనని మెయిల్ ద్వారా సమాచారం అందించింది. ఇప్పటికే ఇన్ఫోసిస్, టీసీఎస్ ఆ దిశగా నిర్ణయం తీసుకోగా తాజాగా విప్రో కూడా ఉద్యోగులను అలర్ట్ చేసింది.
నవంరబ్ 15వ తేదీ నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులు ఆఫీసుకు రావాలని విప్రో ఆదేశించింది. వారంలో కనీసం మూడు రోజులు ఆఫీసులోనే పనిచేయడాన్ని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. కంపెనీ తీసుకున్న నిర్ణయాన్ని ఉల్లంఘించిన వారిపై కంపెనీ పాలసీ ప్రకారం క్రమశిక్షణ చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. ఆఫీసులకు వచ్చి పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయన్న భావనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విప్రో తెలిపింది. టీమ్ సభ్యుల మధ్య ప్రత్యక్షంగా జరిగే చర్చలే ఉత్పాదకతను పెంచుతాయని సంస్థ అభిప్రాయపడింది.
ఇదిలా ఉంటే టీసీఎస్ ఇప్పటికే వారంలో ఐదు రోజులు ఆఫీసు నుంచి పనిచేయడాన్ని తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. మరో దేశీయ దిగ్గజ ఐటీ సంస్థ.. ఇన్ఫోసిస్ సైతం నవంబర్ 20వ తేదీన నుంచి వారంలో కనీసం మూడు రోజులు ఆఫీసుకు రావాలని ఉద్యోగులకు తెలిపింది. పలు ఐటీ కంపెనీల ఆదాయాలు, లాభాల్లో క్షీణత తగ్గిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..