
ఉపాధ్యాయ వృత్తిలో కెరీర్ కొనసాగించాలనుకునే అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించే అవకాశం లభించింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఢిల్లీ ప్రభుత్వ విద్యాశాఖ (Government of NCT of Delhi)లో ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 828 ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో ప్రిన్సిపాల్ పోస్టులు 124, వైస్ ప్రిన్సిపాల్ పోస్టులు 704 వరకు ఉన్నాయి. ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ జూలై 25, 2026 నుంచి ప్రారంభమైంది. ఆగస్టు 14, 2026 సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీతో పాటు బీఎడ్ (B.Ed) అర్హత కలిగి ఉండాలి. అలాగే నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా నిర్దిష్ట బోధనా అనుభవం కూడా తప్పనిసరి. పోస్టును బట్టి అనుభవ నిబంధనలు వేర్వేరుగా ఉంటాయి. పూర్తి అర్హత వివరాలను అధికారిక నోటిఫికేషన్లో తెలుసుకోవచ్చు. అదే విధంగా ప్రిన్సిపాల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు జనరల్/ ఈడబ్ల్యూకు 50 ఏళ్లు, ఓబీసీకి 53 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీకి 55 యేళ్ల వరకు వయోపరిమితి ఉంటుంది. వైస్ ప్రిన్సిపాల్ పోస్టులకు జనరల్/ ఈడబ్ల్యూ అభ్యర్ధులకు 35 ఏళ్లు, ఓబీసీలకు 38 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 40 వరకు అవకాశం ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్లైన్ విధానంలో ఆగస్ట్ 14, 2026వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ /ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు రూ.25 తప్పనిసరిగా చెల్లించాలి. మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులుకు దరఖాస్తు రుసుం నుంచి మినహాయింపు వర్తిస్తుంది. అభ్యర్థుల ఎంపికను రెండు దశల్లో నిర్వహిస్తారు. కంబైన్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (Combined Recruitment Test – CRT, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూలో సాధించిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక చేపడతారు.