EAPCET 2025 Counseling: ఈఏపీసెట్ కౌన్సెలింగ్లో భారీగా మిగిలిపోయిన ఇంజనీరింగ్ సీట్లు.. కారణం ఇదే!
ఇంజినీరింగ్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగో వంతు సీట్లు మిగిలిపోయాయి. కన్వీనర్ కోటాలోనూ విద్యార్థుల కంటే సీట్లే అధికంగా ఉన్నాయి. దీంతో ఈ ఏడాది దాదాపు 34,298 సీట్లు మిగిలిపోయాయి. యూనివర్సిటీల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. వీటిల్లో మొత్తం..

అమరావతి, ఆగస్ట్ 17: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగో వంతు సీట్లు మిగిలిపోయాయి. కన్వీనర్ కోటాలోనూ విద్యార్థుల కంటే సీట్లే అధికంగా ఉన్నాయి. దీంతో ఈ ఏడాది దాదాపు 34,298 సీట్లు మిగిలిపోయాయి. యూనివర్సిటీల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. వీటిల్లో మొత్తం 1361 సీట్లు మిగిలాయి. ఇక యాజమాన్య కోటా సీట్లు కూడా కలిపితే వీటి సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ కన్వీనర్ కోటా సీట్లకు ఈ ఏడాది రెండు విడతలుగా కౌన్సెలింగ్ జరిగింది. ఈ రెండు విడతలు పూర్తయిన తర్వాత ప్రైవేట్ కాలేజీల్లో ఏకంగా 31,811 సీట్లు మిగిలిపోయాయి. ప్రైవేటు యూనివర్సిటీల్లోనూ 1,126 సీట్లు మిగిలాయి.
ఈఏపీసెట్లో రాష్ట్రంలో మొత్తం 1,84,248 మంది విద్యార్ధులు అర్హత సాధించగా.. ఇందులో 1,29,012 మంది కన్వీనర్ కోటాలో చేరేందుకు రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో 1,28,712 మంది విద్యార్ధులు ప్రవేశాలకు అర్హత సాధించారు. అయితే అన్ని ప్రైవేటు వర్సిటీలు, ప్రభుత్వ యూనివర్సిటీలు, కాలేజీల్లో కలిపి కన్వీనర్ కోటా కింద 1,53,964 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కౌన్సెలింగ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అందరికీ సీట్లు కేటాయించినా.. దాదాపు 25 వేలకు పైగా మిగిలే పరిస్థితి నెలకొంది. కొంత మందికి కోరుకున్న కాలేజీల్లో సీట్లు దక్కకపోవడంతో ఈ సీట్లు కూడా మిగిలిపోయాయి.
ప్రైవేటు కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద 70 శాతం, యాజమాన్య కోటా కింద 30 శాతం సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్ యూనివర్సిటీల్లో 35 శాతం, 65 శాతంగా ఉంది. యాజమాన్య కోటా సీట్లలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ) మినహా మిగతా అన్ని బ్రాంచిల్లో సీట్లు భారీగా మిగిలిపోయాయి. డీమ్డ్ వర్సిటీల్లో వంద శాతం సీట్లను యాజమాన్యమే భర్తీ చేస్తుంది. అయితే ఏఐసీటీఈ డీమ్డ్ టు బీ వర్సిటీలకు కొత్త అనుమతులు ఇస్తోంది. చాలామంది వీటిల్లోనూ ప్రవేశాలు పొందుతున్నారు. ఆయా వర్సిటీలు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించుకుని ప్రవేశాలు కల్పిస్తున్నాయి. సీఎస్ఈ బ్రాంచికి డిమాండ్ ఉండడంతో ఇప్పుడు అన్ని విద్యా సంస్థల్లోనూ ఈ సీట్లే అధికంగా ఉన్నాయి. మరోవైపు ఈఏపీసెట్లో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు స్థానికంగా ప్రవేశాలు పొందడానికి బదులు ఎన్ఐటీ, ఐఐటీ, ట్రిపుల్ఐటీలతోపాటు ఇతర రాష్ట్రాల్లో చేరుతున్నారు. ఈ ఏడాది ఈఏపీసెట్లో 200లోపు ర్యాంకుల్లో ఇద్దరు, టాప్ 500 ర్యాంకుల్లో కేవలం 12 మంది మాత్రమే కౌన్సెలింగ్లో పాల్గొనడం ఈ పరిస్థితి అద్దం పడుతోంది. విద్యార్థులు కూడా ఎక్కువగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు దక్కే బ్రాంచిల్లోనే చేరుతున్నారు. అందుకే డిమాండ్ ఉన్న కోర్సుల కన్నా మిగిలిన మిగిలిన సీట్లన్నీ మిగిలిపోతున్నాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




