
హైదరాబాద్, జూన్ 2: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. ఈ రోజు ఏకంగా 3 ఉద్యోగ నోటిఫికేషన్లను ఒకేసారి టీజీపీఎస్సీ విడుదల చేయనుంది. ఈ మూడు నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 280 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. అంతేకాకుండా ఇక ప్రతి నెలనెలా రెండు లేదా మూడు ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఛైర్మన్ బుర్రా వెంకటేశం వెల్లడించారు.
ఈ రోజు విడుదల చేయనున్న మూడు నోటిఫికేషన్లలో కాలుష్య నియంత్రణ మండలిలో సహాయ పర్యావరణ ఇంజినీర్ పోస్టులు 9, రోడ్డు భవనాల శాఖలో ఏఈఈ సివిల్ పోస్టులు 222, ఏఈఈ ఎలక్ట్రికల్ పోస్టులు 49 వరకు ఉన్నాయని పేర్కొన్నారు. ఆర్థికశాఖ మొత్తం 3,800 పోస్టులకు అనుమతించిందని అన్నారు. ఇందులో అటవీ బీట్ అధికారి పోస్టులు గరిష్టంగా 1,393 వరకు ఉన్నాయని అన్నారు. ఈ మేరకు టీజీపీఎస్సీ కార్యాలయంలో బుర్రా వెంకటేశం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
అలాగే మరో వారం రోజుల వ్యవధిలో మరో మూడు ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయని తెలిపారు. ఈ నెలలో మొత్తంగా ఆరు నోటిఫికేషన్లు ఉంటాయని వెల్లడించారు. ఇంజినీరింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అటవీ శాఖ, టౌన్ & కంట్రీ ప్లానింగ్, విద్యాశాఖలో ఖాళీలు భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ నిరంతరం జరుగుతుందని అన్నారు. టీజీపీఎస్సీ భర్తీ చేసే ఉద్యోగ నియామకాలలో దాదాపు 90 శాతం నోటిఫికేషన్లకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (సీబీఆర్టీ) నిర్వహించాలని కమిషన్ భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తద్వారా పరీక్షల నిర్వహణ ఖర్చు, ముద్రణ, తరలింపు, పేపర్ లీకేజీ వంటి సమస్యలకు ఆస్కారం ఉండదని తెలిపారు. ఆన్లైన్ పరీక్షలు కావడంతో పరీక్షకు గంట ముందు ప్రశ్నపత్రం ఆటోమెటిక్గా సిద్ధమవుతుంది. ఇక అభ్యర్ధి రాసిన పరీక్ష ముగియగానే అప్పటికే సిద్ధమైన ప్రాథమిక కీ ఆధారంగా స్క్రీన్పై స్కోర్ కూడా ప్రత్యక్షం అవుతుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.