
హైదరాబాద్, జూన్ 26: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ఈఏపీసెట్ ఇంజినీరింగ్ విభాగంలోని టాపర్లు మన రాష్ట్రంలో అడ్మిషన్లు పొందడం లేదు. వీరంతా ఇతర రాష్ట్రాల్లో చదివేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది ఈఏపీసెట్ టాప్ 100 ర్యాంకర్లలో కేవలం ఐదుగురు మాత్రమే ఎప్సెట్ వెబ్ కౌన్సెలింగ్కు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. అంటే 95 మంది ఇంతవరకు ఈఏపీసెట్ కౌన్సెలింగ్ వైపే చూడలేదన్నమాట. ఇక 100 నుంచి 500లోపు ర్యాంకర్లలో కేవలం 42 మంది మాత్రమే కౌన్సెలింగ్కు దరఖాస్తు చేసుకోవడం విచిత్రంగా మారింది.
తాజాగా ఈఏపీసెట్ తొలి విడత కౌన్సెలంగ్కు రిజిస్ట్రేషన్ గడువు ముగియగా.. ప్రస్తుతం సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ క్రమంలో తొలి విడతకు 84,002 మంది విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోగా.. వీరిలో జూన్ 24 నాటికి 36,393 మంది వెరిఫికేషన్కు హాజరయ్యారు. రాష్ర్టానికి చెందిన టాప్ ర్యాంకర్లలో అత్యధికులు సీటు వస్తే ఐఐటీలు, ఎన్ఐటీల్లో చేరుతున్నారు. ఫీజులు కట్టే స్థోమత ఉన్నవారు మాత్రం ప్రైవేట్ వర్సిటీల బాటపడుతున్నారు. రాష్ట్రంలో టాప్ 20 కాలేజీలు మినహా మిగతా ఇంజనీరింగ్ కాలేజీల్లో నాసిరకం విద్యా ప్రమాణాలు ఉండటమే అందుకు కారణమని అంటున్నారు. కేవలం ఈఏపీసెట్లో 5 వేల తర్వాతి ర్యాంకర్లు మాత్రమే రాష్ట్రంలో అడ్మిషన్లు పొందుతున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పూర్తి సమాచారం కోసం ఈ కింది గణాంకాలు పరిశీలించండి..