
హైదరాబాద్, మే 8: రాష్ట్రంలో ఈఏపీసెట్ 2026 ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఆన్లైన్ పరీక్షలు రేపట్నుంచి (మే 9) నుంచి ప్రారంభంకానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,10,766 మంది అభ్యర్ధులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. మే 9 నుంచి మే 11 వరకు మొత్తం మూడు రోజులపాటు రోజుకు రెండు షిఫ్టుల్లో (ఉదయం, మధ్యాహ్నం షిఫ్టుల్లో) ఈ పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఒక సెషన్, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మరో సెషన్ ఉంటుంది. ఉదయం సెషన్లో 7.30 గంటలకు, సాయంత్రం సెషన్లో మధ్యాహ్నం 1.30 గంటలకే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవల్సి ఉంటుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. పరీక్ష సమయం ముగిసేలోపు ఏ విద్యార్థి కూడా పరీక్షా హాలు నుండి బయటకు వెళ్ళడానికి అనుమతించరు. ఒక్కో ఫిస్టులో సుమారు 35 వేల మంది చొప్పున పరీక్షలు రాయనున్నారు. మొత్తం 125 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ కె విజయకుమార్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
అయితే ఈ ఏడాది ఉన్నత విద్యామండలి ఆన్లైన్ పరీక్షలు రాసే ఈఏపీసెట్ అభ్యర్ధుల కోసం మరో నూతన విధానాన్ని తీసుకువచ్చింది. అదేంటంటే.. ప్రతి షిఫ్టులోనూ పరీక్ష పూర్తయిన వెంటనే స్క్రీన్పై మార్కులు కనిపించనున్నాయి. హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ ( JNTU – హైదరాబాద్) ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ పరీక్ష పారదర్శకతను మెరుగుపరచడం, విద్యార్థుల ఆందోళనను తగ్గించడం లక్ష్యంగా ఈ విధానం తీసుకువచ్చింది. అయితే ఈ స్కోర్ ప్రొవిజినల్ మార్కులు మాత్రమే. తుది ఆన్సర్ కీ, నార్మలైజేషన్ ప్రక్రియ తర్వాత మాత్రమే తుది మార్కులు, ర్యాంకు నిర్ణయిస్తారు.
టీజీ ఈఏపీసీఈటీ 2026 కన్వీనర్ మరియు జేఎన్టీయూ-హైదరాబాద్ రెక్టార్ డాక్టర్ కె విజయ కుమార్ రెడ్డి, అభ్యర్థులు పరీక్షా కేంద్రం ఉన్న ప్రదేశాన్ని తెలుసుకోవడానికి చాలా ముందుగానే కేంద్రానికి వెళ్లాలని మరియు హాల్ టికెట్లో పేర్కొన్న సూచనలను పాటించాలని సూచించారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఒకే రకమైన పేరుతో పలు ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నందున గందరగోళానికి గురికాకుండా పరీక్ష కేంద్రాలను ఒక రోజు ముందుగా వెళ్లి పరిశీలించుకోవాలని కన్వీనర్ సూచించారు. హాల్టికెట్పై క్యూఆర్ కోడ్ ముద్రించామని, దాన్ని వినియోగించుకుంటే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని పేర్కొన్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.