
హైదరాబాద్, జూన్ 9: తెలంగాణ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్ష (TG EAPCET 2026) కౌన్సెలింగ్ షెడ్యూల్ తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సారి మొత్తం 3 విడతల్లో ఈఏపీసెట్ కౌన్సెలింగ్ జరగనుంది. కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు జూన్ 19 నుంచి మొదలవనున్నాయి. జూన్ 19 నుంచి 28 వరకు స్లాట్ బుకింగ్కు చేసుకోవచ్చు. ఇక జూన్ 22 నుంచి 29 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. జూన్ 25 నుంచి జులై 1 వరకు వెబ్ ఆప్షన్స్కు అవకాశం ఉంటుంది. జులై 4న మాక్ సీట్ అలకేషన్ ఉంటుంది. చివరకు జులై 10న మొదటి విడత సీట్ల కేటాయింపు వివరాలు వెల్లడిస్తారు. ఇందులో సీట్లు పొందిన విద్యార్ధులు జులై 10 నుంచి 14 వరకు సంబంధిత కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయవల్సి ఉంటుంది.
ఇక రెండో విడద కౌన్సెలింగ్ జూన్ 17 నుంచి మొదలవతుంది. సీట్లు పొందిన వారు జులై 25 నుంచి 28 లోపు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. జులై 28లోపు సీటు రద్దు చేసుకోవచ్చు. మూడో విడత కౌన్సెలింగ్ జులై 31 నుంచి మొదలవుతుంది.ఆగస్టు 5న సీట్ల కేటాయింపు, ఆగస్టు 5 నుంచి 7లోపు వెబ్సైట్లో సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంటుంది. మొదటి విడతలో సీటు రాని వారు, కొత్తగా దరఖాస్తు చేసుకునే వారితో పాటు రెండో విడత కౌన్సెలింగ్లో పాల్గొనవచ్చు. ఆ తర్వాత మిగిలిపోయిన సీట్ల భర్తీకి జూలై 31న మూడో విడత కౌన్సెలింగ్ ఉంటుంది. ఈ మూడు విడతల ప్రక్రియ ముగిసిన తర్వాత మిగిలిపోయిన సీట్ల భర్తీకి సంబంధించి ఆగస్టు చివరి వారంలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తారు.
తెలంగాణలోని పాలిటెక్నిక్, బీఎస్సీ మ్యాథమెటిక్స్ విద్యార్థులకు బీటెక్, బీఫార్మసీలో నేరుగా రెండో సంవత్సరంలో చేరేందుకు లేటరల్ ఎంట్రీ ద్వారా ప్రవేశాలకు జూన్ 15 నుంచి ఈసెట్ కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. ఈ మేరకు ఈసెట్ ప్రవేశాల షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఈసెట్ తొలి విడత కౌన్సెలింగ్కు జూన్ 15 నుంచి 18 వరకు స్లాట్ బుకింగ్, జూన్ 17 నుంచి 19 వరకు సర్టిఫికెట్ల పరిశీలన, జూన్ 17 నుంచి 21 వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కొనసాగుతుంది. జూన్ 24వ తేదీలోపు సీట్లు కేటాయింపు ఉంటుంది. ఇక తుది విడత కౌన్సెలింగ్ జులై 4 నుంచి 13వ తేదీ జరుగుతుంది. ఈ మేరకు ప్రవేశాల కన్వీనర్ శ్రీదేవసేన వెల్లడించారు. ఈలోపు విద్యార్ధులు అవసరమైన సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవల్సి ఉంటుంది.