
హైదరాబాద్, మే 19: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీజీ ఈఏపీసెట్ 2026 ఫలితాలు ఆదివారం (మే 17) విడుదలైన సంగతి తెలిసిందే. ఈఏపీసెట్ పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా మే 4 నుంచి 11 వరకూ ఆన్లైన్ విధానంలో జరిగాయి. తాజా ఫలితాల్లో ఇంజనీరింగ్లో 73.36 శాతం, అగ్రికల్చర్, ఫార్మసీలో 86.27 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ రెండు విభాగాల్లోనూ బాలికలదే పైచేయి కావడం విశేషం. ఇంజనీరింగ్ విభాగంలో 2,10,766 మంది దరఖాస్తు చేసుకోగా, 1,97,242 మంది పరీక్ష రాశారు. వీరిలో 1,44,704 మంది అర్హత సాధించారు. అగ్రి, ఫార్మా సెట్కు 90,977 మంది దరఖాస్తు చేస్తే, 84,954 మంది పరీక్ష రాశారు. వీరిలో 73,294 మంది అర్హత సాధించారు. ఇంజనీరింగ్లో బాలురు 84.70 శాతం మంది, బాలికలు 86.76 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.
ఈఏపీసెట్ ఫలితాలు వెల్లడించడంతో కాలేజీల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి ఏర్పాట్లు చేస్తుంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను మే నెలాఖరు నుంచి మొదలు పెడుతున్నట్టు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.16 లక్షల ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయని, వీటిల్లో 70 శాతం సీట్లను కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తామని తెలిపారు. మిగతా సీట్లను యాజమాన్య కోటాలో భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే తెలంగాణ ఈఏపీసెట్ పరీక్షలో ఏపీ విద్యార్థులు టాపర్లుగా మెరిశారు. అయితే వీరికి కౌన్సెలింగ్లో పాల్గొనే అవకాశం లేదని తెలిపారు.
ఈ ఏడాది ఈఏపీసెట్ విశేషం మరొకటి కూడా ఉంది. పరీక్షలు నిర్వహించిన కేవలం వారం రోజుల్లోనే ఈఏపీసెట్ ఫలితాలు విడుదల చేయడం గమనించదగిన విషయం. అదీ ఎలాంటి చిన్న పొరపాట్లు లేకుండా, ఎలాంటి సమస్యలు రాకుండా విజయవంతంగా ఫలితాలు వెల్లడించడం ఉన్నత విద్యామండలి సమర్ధతకు నిదర్శనం. ఇక కౌన్సెలింగ్కు సంబంధించిన షెడ్యూల్ను వారం రోజుల్లో విడుదల చేస్తామని చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.