
హైదరాబాద్, మార్చి 15: తెలంగాణ ఉన్నత విద్యా మండలి (TGCHE) రాష్ట్ర విద్యార్ధులకు శుభవార్త చెప్పింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర వర్సిటీల్లో పలు కొత్త కోర్సులను ప్రవేశ పెడుతున్నట్లు ప్రకటించింది. ఎయిర్పోర్టు అండ్ ఎయిర్ ట్రాఫిక్ నిర్వహణ, మారిటైమ్ టెక్నాలజీకి సంబంధించి క్లైమేట్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ నుంచి మెడికల్ మైక్రోబయాలజీ వరకు పలు ఖరీదైన కోర్సులు ఇప్పుడు తెలంగాణ వర్సిటీకి వచ్చేస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో వచ్చే విద్యా సంవత్సరానికి పలు కొత్త అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్లను ప్రారంభించనున్నట్లు ఉన్నత విద్యా మండలి వెల్లడించింది.
ఈ కొత్త కోర్సులు ఇంటిగ్రేట్ టెక్నాలజీ, మేనేజ్మెంట్, లీగల్ ఫ్రేమ్వర్క్స్, సెక్టోరల్ ఎక్స్పర్టైజ్ రంగాలకు చెందినవి. ఇందులో యూజీ, పీజీ పట్టభద్రులైన తర్వాత విద్యార్ధులు సులభంగా ఉపాధి పొందగలిగేలా కోర్సులను రూపొందిస్తున్నారు. అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) కోర్సులను మూడేళ్లు, నాలుగేళ్ల ఆనర్స్తో ఈ కోర్సులను అందిస్తున్నారు. ఈ కోర్సులకు బహుళ ప్రవేశాలు, నిష్క్రమణ సదుపాయం కూడా ఉంటుంది. అంటే విద్యార్థులు ప్రతి విద్యా సంవత్సరం తర్వాత ఈ కోర్సు నుంచి నిష్క్రమించవచ్చు. ఇలా ఏడాది తర్వాత నిష్ర్కమిస్తే సర్టిఫికేట్ అందజేస్తారు. రెండేళ్లు పూర్తి చేస్తే డిప్లొమా సర్టిఫికెట్, మూడేళ్ల తర్వాత డిగ్రీ పట్టా అందిస్తారు. నాలుగు సంవత్సరాల కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు రీసెర్చ్ చేసేందుకు ఆనర్స్, రీసెర్చ్ డిగ్రీలో ప్రవేశాలు పొందేందుకు అర్హత సాధిస్తారు.
యువతలో నైపుణ్య అంతరాలను తగ్గించడానికి, ఉపాధి అవకాశాలను పెంచడానికి అన్ని నేపథ్యాల నుంచి యువతకు సాధికారత కల్పించడానికి ఈ కార్యక్రమాలు రూపొందించినట్లు TGCHE చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకిష్ట రెడ్డి తెలిపారు. విద్యార్ధులకు ఆచరణాత్మక అనుభవాన్ని అందించేందుకు పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిపారు. అడ్వైజరీ బోర్డులు, ఇంటర్న్షిప్లు, అధ్యాపక అభివృద్ధికి పరిశ్రమ సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.