తెలంగాణ విద్యాశాఖ సంచలన నిర్ణయం! టెట్‌ అర్హత జీవితకాలం.. ఆ పోస్టులకు బీఈడీ అభ్యర్థులూ అర్హులే..

ప్రత్యేక తెలంగాణలో మూడోసారి టెట్‌ నిర్వహణకు రంగం సిద్ధం అవుతోంది. గతంలో 2016 మే, 2017 జులైలో ఈ పరీక్ష నిర్వహించారు. ఈ సారి కీలక మార్పులతో..

తెలంగాణ విద్యాశాఖ సంచలన నిర్ణయం! టెట్‌ అర్హత జీవితకాలం.. ఆ పోస్టులకు బీఈడీ అభ్యర్థులూ అర్హులే..
Ts Tet 2022

Updated on: Mar 24, 2022 | 3:11 PM

Telangana TET Certificate Valid for Life time: తెలంగాణలో ఇప్పటికే కొలువుల జాతర మొదలైంది. పలు శాఖలు నియామక నోటిఫకేషన్లు జారీ చేయడానికి కసరత్తులు చేస్తున్నాయి. ఇక పాఠశాల విద్యాశాఖలో ఖాళీగా ఉన్న 13,086 పోస్టుల్లో 10,000లవరకు టీచర్‌ పోస్టులు (TS Teacher Job Vacancies)న్నాయి. వీటిల్లో 6,700ల వరకు ఎస్జీటీ ఉపాధ్యాయ కొలువులు (ఆదర్శ పాఠశాలల్లోని ఖాళీలను కూడా కలుపుకుంటే 11,000ల వరకు ఉండొచ్చిని అంచనా) ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఐతే టీచర్‌ నియామకాలకు ముందు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)ను సాధ్యమైనంత త్వరగా నిర్వహించాలని విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా బుధవారం (మార్చి 23) పాఠశాల విద్యాశాఖను ఆదేశించారు. టెట్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో పరీక్ష నిర్వహణకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. 2015 డిసెంబరు 23న టెట్‌కు సంబంధించి జారీ చేసిన జీఓ 36లో ప్రధానంగా రెండు సవరణలు చేస్తూ ప్రభుత్వం తాజాగా జీఓ 8 ఇచ్చింది. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (NCTE) మార్గదర్శకాల ప్రకారం ఈ మార్పులు చేశారు. ఇక టెట్‌ పరీక్ష కూడా మే నెలలోనే నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక తెలంగాణలో టెట్‌ నిర్వహించడం ఇది మూడోసారి. గతంలో 2016 మే, 2017 జులైలో ఈ పరీక్ష నిర్వహించారు.

ఇప్పటివరకు బీఈడీ అభ్యర్థులు 6 – 10 తరగతులు బోధించేందుకు మాత్రమే అర్హులు. అందుకు టెట్‌లో పేపర్‌-2 రాసేవారు. ఇక నుంచి వారు 1 – 5 తరగతులకు బోధించేందుకు ఎస్జీటీలుగా నియమితులు కావొచ్చు. అంటే వారు టెట్‌లో పేపర్‌ 1 రాయవచ్చు. కాకపోతే ఉద్యోగంలో చేరిన రెండేళ్లలోపు ప్రాథమిక విద్య బోధనలో 6 నెలల బ్రిడ్జి కోర్సు పూర్తి చేయాలి. ఇప్పటివరకు పేపర్‌-1కు కేవలం డీఈడీ వారు మాత్రమే అర్హులుగా ఉండేవారు. మరో కీలక మార్పేమిటంటే.. ఒకసారి టెట్‌లో అర్హత సాధిస్తే ఆ ధ్రువపత్రానికి ఇప్పటివరకు 7 ఏళ్ల కాలపరిమితి ఉండేది. గడువు ముగిశాక మళ్లీ టెట్‌ రాసుకోవాల్సిందే. ఐతే అందుకు భిన్నంగా ఒకసారి టెట్‌లో అర్హత సాధిస్తే జీవితాంతం విలువ ఉండేలా మార్పు చేయాలని ఎన్‌సీటీఈ రెండేళ్ల క్రితమే నిర్ణయించింది.

తాజాగా తెలంగాణ విద్యాశాఖ ఆ ప్రకారం మార్పు చేసింది. 2011 ఫిబ్రవరి 11వ తేదీ నుంచి టెట్‌లో అర్హత సాధించిన వారి ధ్రువపత్రం ఇప్పుడూ చెల్లుబాటవుతుంది. రాష్ట్రంలో ఇప్పటికే టెట్‌ పాసైన వారు సుమారు 3 లక్షల మంది ఉంటారని అంచనా. టెట్‌ను 150 మార్కులకు నిర్వహిస్తారు. జనరల్‌ కేటగిరీ విద్యార్థులకు 90 మార్కులు (60 శాతం), బీసీలకు 75 మార్కులు (50 శాతం), ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులకు 60 మార్కులు (40 శాతం) మార్కులు వస్తే అర్హత సాధించినట్లుగా పరిగణిస్తారు. టెట్‌లో వచ్చిన మార్కులకు ఉపాధ్యాయ నియామకాల్లో భాగంగా నిర్వహించే పరీక్షలకు 20 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకు కేటాయిస్తారు. తాజా పరిణామంతో తెలంగాణలో ఒక్కసారి టెట్‌లో అర్హత సాధిస్తే జీవితకాలం సదరు సర్టిఫికేట్‌కు వ్యాల్యూ ఉంటుందన్నమాట.

Also Read:

TMC Visakhapatnam Jobs: విశాఖపట్నంలోని హోమీ భాభా క్యాన్సర్‌ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో ఉద్యోగాలు.. నో ఎగ్జాం!

Loading...
Unable to load recommendations.
Follow Us