
హైదరాబాద్, జూన్ 15: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పునప్రారంభం కానున్నాయి. పాఠశాల విద్యాశాఖ ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ ఇప్పటికే పూర్తి చేసింది. అకడమిక్ కేలండర్ను కూడా విడుదల చేసింది. బోధనతోపాటు ఈసారి ప్రతిరోజూ క్రీడలు నిర్వహించాలని ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ స్కీం తప్పనిసరిగా అమలు చేయాలని సూచించింది. ఈ క్రమంలో బ్రేక్ ఫాస్ట్ మెనూ సైతం విడుదల చేసింది. మెనూ ప్రకారం ఏ రోజు ఏయే వంటకాలు విద్యార్ధులకు అందిస్తారో ఇక్కడ తెలుసుకుందాం..
ఉదయం పూట టిఫిన్తో పాటు మూడు రోజులు పాలు, మిగిలిన మూడు రోజులు రాగి జావ అందిస్తారు. ప్రభుత్వ బడులతోపాటు కాలేజీల్లోనూ ఈ ఏడాది నుంచి ఉదయం అల్పాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం నుంచే అంటే ఈ రోజు నుంచే ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. కాలేజీల్లో దశలవారీగా ఈ పథకాన్ని అమలు చేస్తారు. మొత్తం 1.44 లక్షల మందికి బ్రేక్ఫాస్ట్ అందించనున్నారు. ఇది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచుతుందని విద్యాశాఖ భావిస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 30 వేల స్కూళ్లలో 24 లక్షల మంది పిల్లలు ఉన్నారు. 10 వేల వరకూ ఉన్న ప్రైవేటు విద్యాసంస్థల్లో 36 లక్షల మంది చదువుతున్నారు. ఈ పరిస్థితిని మార్చాలని రెండేళ్లుగా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది విద్యావ్యవస్థలో పలు కీలక సంస్కరణలు తీసుకువచ్చారు.