
తెలంగాణలో 2025-26 విద్యా సంవత్సరానికి వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీజీఈసెట్)-2025 నోటిఫికేషన్ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి తాజాగా విడుదల చేసింది. ఈ ఏడాది కూడా ఈ పరీక్షను జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (జేఎన్టీయూహెచ్) నిర్వహించనుంది. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీలు, అఫిలియేటెడ్ ఇంజినీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కాలేజీల్లో.. ఏరోస్పేస్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, బయోమెడికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, బయో-టెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్, ఫుడ్ టెక్నాలజీ, మెటలర్జికల్ ఇంజినీరింగ్, మైనింగ్ ఇంజినీరింగ్, నానో టెక్నాలజీ, జియో-ఇంజినీరింగ్ అండ్ జియో-ఇన్ఫర్మాటిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్, ఫార్మసీ, టెక్స్టైల్ టెక్నాలజీ.. మొత్తం 19 విభాగాల్లో ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్, గ్రాడ్యుయేట్ లెవెల్ ఫార్మ్ డి కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
తెలంగాణ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీజీఈసెట్)-2025కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, బీఫార్మసీ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. అర్హులైన అభ్యర్థులు మార్చి 17 నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. మే 19, 2025వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. రిజిస్ట్రేషన్ ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.1100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్ధులు రూ.600 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఆన్లైన్ రాత పరీక్షలు జూన్ 16 నుంచి 19వ తేదీ వరకు నిర్వహిస్తారు. రాత పరీక్ష 2 గంటల పాటు ఉంటుంది. మొత్తం 120 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించవల్సి ఉంటుంది.
తెలంగాణ పీజీఈసెట్ 2025 నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.