
హైదరాబాద్, నవంబర్ 2: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 25 తేదీ నుంచి మొదలవనున్నాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి, సెకండ్ ఇయర్ పరీక్షలు ఫిబ్రవరి 26వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. సబ్జెక్టుల వారీగా పరీక్షల టైం టేబుల్ను ఇప్పటికే ఇంటర్బోర్డు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాత పరీక్షలు నిర్వహిస్తారు. ఇక ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 21 వరకు ప్రతిరోజూ ఆయా తేదీల్లో రెండు షిఫ్టుల్లో జరుగుతాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ 20 మార్కులకు ఉంటాయి. ఇవి ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు జనవరి 21న, సెకండియర్ విద్యార్ధులకు జనవరి 22న జరుగుతాయి. ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు జనవరి 24దీన ఎన్విరాన్మెంట్ పరీక్ష ఉంటుంది.
కాగా ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్లకు కలిపి సుమారు 9.50 లక్షల మంది విద్యార్థులు పబ్లిక్ పరీక్షలు రాయనున్నారు. ఇక ఈ పరీక్షలకు ఫీజు చెల్లింపులు నవంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభమైనాయి. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా నవంబరు 14వ తేదీ వరకు పరీక్షల ఫీజు చెల్లించడానికి అవకాశం ఉంటుంది. ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్షకు రూ.100 ఫీజును వసూలు చేయాలని ఇంటర్బోర్డు నిర్ణయించింది. ఫస్ట్ ఇయర్ జనరల్ కోర్సుల విద్యార్థులు రూ.630, ఒకేషనల్ విద్యార్థులు రూ.870 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఇక సెకండ్ ఇయర్ ఆర్ట్స్కు రూ.630, సైన్స్, ఒకేషనల్ విద్యార్ధులు రూ.870 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. రూ.2 వేల ఆలస్య రుసుంతో డిసెంబరు 15 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంటుంది.
తెలంగాణ ఇంటర్ పబ్లిక్ పరీక్షల 2026 ఇతర సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.