
హైదరాబాద్, ఫిబ్రవరి 18: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 25 తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా బుధవారం ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ హాల్ టికెట్లు విడుదలకానున్నాయి. విద్యార్ధులు ఆయా కాలేజీల్లో ప్రిన్సిపల్ నుంచి హాల్ టికెట్లు పొందవచ్చు. లేదంటే విద్యార్ధుల తల్లిదండ్రుల మొబైల్ నుంచి కూడా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్ నుంచి కూడా నేరుగా వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాగా ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి.
తెలంగాణ ఇంటర్ 2026 హాల్ టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9,96,529 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరుకాబోతున్నారు. మొత్తం 1495 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల నిఘాలో ఈసారి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తు్న్నారు. పరీక్ష కేంద్రానికి చేరుకునేందుకు గతేడాది మాదిరిగానే 5 నిమిషాల గ్రేస్ టైమ్ ఇస్తున్నట్లు ఇప్పటికే ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ఇంటర్ బోర్డు ఇచ్చిన గ్రేస్ టైం మేరకు ఉదయం 9.05 గంటల వరకు విద్యార్ధులకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఉంటుంది. పరీక్షా కేంద్రాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. పరీక్షలు జరిగే ప్రతి హాల్లో వాల్ క్లాక్ (గోడ గడియారం) తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.