TG Inter Exams 2026: రేపట్నుంచే ఇంటర్‌ పరీక్షలు.. 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా ఓకే!

ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు రేపట్నుంచి (ఫిబ్రవరి 25) నుంచి మొదలు కానున్నాయి. విద్యార్ధులు పరీక్ష కేంద్రాలకు 30 నిమిషాల ముందే రావాలని సూచించారు. అయితే ట్రాఫిక్‌, లేదంటే ఏదైనా పర్సనల్‌ ఇబ్బంది వల్ల విద్యార్థులు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా పరీక్ష హాల్‌లోకి..

TG Inter Exams 2026: రేపట్నుంచే ఇంటర్‌ పరీక్షలు.. 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా ఓకే!
Telangana Inter Exams

Updated on: Feb 24, 2026 | 8:21 PM

హైదరాబాద్‌, ఫిబ్రవరి 24: ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు రేపట్నుంచి (ఫిబ్రవరి 25) నుంచి మొదలు కానున్నాయి. మార్చి 18 వరకు జరిగే ఈ పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయని బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య స్పష్టం చేశారు. విద్యార్ధులు పరీక్ష కేంద్రాలకు 30 నిమిషాల ముందే రావాలని సూచించారు. అయితే ట్రాఫిక్‌, లేదంటే ఏదైనా పర్సనల్‌ ఇబ్బంది వల్ల విద్యార్థులు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా పరీక్ష హాల్‌లోకి అనుమతిస్తామని ఆయన చెప్పారు. చివరి నిమిషంలో హడావిడిగా వచ్చి ఆందోళన చెందే బదులు అరగంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 9,97,075 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్ధులు 4,89,126 మంది, సెకండ్ ఇయర్‌ విద్యార్ధులు 5,07,949 మంది వరకు ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 1,495 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇంటర్ బోర్డు అన్ని జిల్లాలకు ప్రశ్నపత్రాలను పంపించారు. రాష్ట్రంలో ఎక్కడా సమస్యాత్మక పరీక్షా కేంద్రాలు లేవని, జోన్‌ ఆధారంగా హాల్‌టికెట్ల జంబ్లింగ్‌ ప్రక్రియ నిర్వహించామని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. ఇటీవల ముగిసిన ప్రాక్టికల్‌ పరీక్షలో నాలుగు కేంద్రాల్లో మాల్‌ప్రాక్టీస్‌ జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని, దీనిపై విచారణ కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.

విద్యార్ధులు వెబ్‌సైట్‌ నుంచి కూడా నేరుగా హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని, ప్రిన్సిపల్‌ సంతకం లేకపోయినా విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామన్నారు. ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీల ప్రిన్సిపల్‌లు విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడితే.. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. కాపీయింగ్, మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడితే క్రిమినల్‌ కేసులు పెట్టి, డిబార్‌ చేస్తామని హెచ్చరించారు. ఫిర్యాదుల పరిష్కారానికి 040-24655027, 9240205555 నంబర్లకు ఫోన్‌ చేయవచ్చని సూచించారు. విద్యార్థులు ఒత్తిడి, ఆందోళనకు గురైతే టెలి-మానస్‌కు నేరుగా ఫోన్‌ చేయవచ్చని, 24 గంటలూ టోల్‌ఫ్రీ నంబరు 14416 అందుబాటులో ఉంటుందని వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us